HDFC Bank | కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)` కొత్త ప్లాట్ ఫామ్ తీసుకొచ్చింది. వివిధ రకాల బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, సర్వీసులను ఖాతాదారులకు అందుబాటులోకి తేవడానికి ‘ఎక్స్ప్రెస్ వే’ అనే కొత్త ప్లాట్ ఫామ్ ప్రారంభించింది. దీని కింద వ్యక్తిగత/ వ్యాపార/ ఆటోమొబైల్ రుణాలు, క్రెడిట్ కార్డు, పొదుపు ఖాతా పొందవచ్చు.
ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఖాతాదారులకు సర్వీస్ అందించడమే ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రధానోద్దేశం అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఖాతాదారులతోపాటు ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాదారులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ డిజిటల్ ప్రొడక్ట్స్ సేవలన్నీ ఒకే వేదికపై అందించేందుకు.. ఖాతాదారులకు సౌకర్యవంతమైన, సత్వర సేవలు అందించడానికి ఈ ప్లాట్ ఫామ్ ప్రారంభించామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిట్ ప్రొడక్ట్స్, సర్వీసుల వేదిక ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నౌ’ లో భాగంగా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించింది.