న్యూఢిల్లీ, జూన్ 9: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు అన్ని రకాల కాలపరిమితి కలిగిన రుణాలకు వర్తించనున్నదని పేర్కొంది. పెరిగిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని తెలిపింది. రెండేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.55 శాతానికి ఎగబాకింది.
అలాగే ఏడాది కాలపరిమితితో రుణాలపై ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 8.40 శాతానికి చేరుకున్నది. ఏడాది కాలపరిమితితో ఎక్కువగా వాహన, వ్యక్తిగత, గృహ రుణాలు తీసుకుంటున్నారు. వీటితోపాటు ఒక్కరోజు, మూడు, ఆరు నెలలు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో వరుసగా 8.10 శాతం, 8.20 శాతం, 8.35 శాతం, 8.65 శాతానికి చేరుకున్నాయి. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం విశేషం.