న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.3,983 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,599 కోట్లతో పోలిస్తే 10.85 శాతం వృద్ధి నమోదైంది. కానీ, మూడో త్రైమాసికంలో నమోదైన రూ.4,096 కోట్ల కంటే మూడు శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.22,597 కోట్ల నుంచి రూ.26,606 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,01,456 కోట్ల ఆదాయంపై రూ.14,845 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయంలో 18.45 శాతం వృద్ధి కనబరుచగా..నికర లాభంలో 10 శాతం పెరిగింది. మరోవైపు గతేడాదికిగాను రూ.18 డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది.
హెచ్సీఎల్ కూడా ఉద్యోగ నియామకాలను భారీగా తగ్గించుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి 17,067 మందిని రిక్రూట్ చేసుకున్నట్టు కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయ కుమార్ తెలిపారు. అంతక్రితం ఏడాది రిక్రూట్ చేసుకున్న 40 వేలతో పోలిస్తే సగానికి సగం తగ్గారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,25,944కి చేరుకున్నారు. గతేడాది మొత్తానికి 30 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన వెల్లడించారు.