HCL Tech Q4 | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ (హెచ్సీఎల్ టెక్) మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి రూ.3,983 కోట్ల నికర లాభం గడించింది. గతేడాది (2021-22) మార్చి త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ. 2021-22 చివరి త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ రూ.3,593 కోట్ల నికర లాభం గడించింది.
ఆపరేటింగ్ రెవెన్యూ 18 శాతం పెంచుకుని రూ.26,606 కోట్ల ఆదాయం సముపార్జించింది. గతేడాది (2021-22)లో రూ.22,597 కోట్ల రెవెన్యూ సమకూర్చుకున్నది. గురువారం హెచ్సీఎల్ టెక్ త్రైమాసికం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం ఎన్ఎస్ఈలో సంస్థ షేర్ 0.16 శాతం నష్టంతో రూ.1,037 వద్ద స్థిర పడింది.
గత ఆర్థిక సంవత్సరానికి ఇన్వెస్టర్లకు షేర్పై రూ.18 ఇంటరిమ్ డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు హెచ్సీఎల్ టెక్ బోర్డు తెలిపింది. అయితే, డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో నికర లాభాల్లో మూడు శాతం క్షీణత రికార్డయింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ.4,096 కోట్ల నికర లాభం సంపాదించింది.
గత మూడు నెలల్లో 10 సర్వీస్, మూడు సాఫ్ట్ వేర్ సంస్థలతో కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. మొత్తం కాంట్రాక్ట్ విలువ 207 కోట్ల డాలర్లు. గతేడాదితో పోలిస్తే ఎనిమిది శాతం తక్కువ. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో హెచ్సీఎల్ టెక్ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ.11 లక్షల కోట్లు దాటింది. అయితే, మార్కెట్ వర్గాలు హెచ్సీఎల్ టెక్ మార్చి త్రైమాసికంలో రూ.3,860 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశారు.