ముంబై, ఏప్రిల్ 21: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,593 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,102 కోట్ల లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. 2020-21లో పన్ను చెల్లింపులు, బోనస్కోసం రూ.2,962 కోట్లను చెల్లించడంతో లాభాలపై ప్రభావం చూపింది. మూడో త్రైమాసికంలో నమోదైన రూ.3,442 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 4.4 శాతం అధికమైంది. అటు ఆదాయంలోనూ భారీ వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం అధికమై రూ.22,597 కోట్లకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.19,642 కోట్లుగా ఉన్నది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ..
గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ సంస్థ దూకుడును ప్రదర్శించింది. రూ.85,651 కోట్ల ఆదాయంపై రూ.13,499 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. లాభంలో 21.1 శాతం వృద్ధిని కనబరుచగా, ఆదాయంలో 13.6 శాతం ఎగిసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయకుమార్ మాట్లాడుతూ..సేవల రంగం ఇచ్చిన దన్నుతో గత త్రైమాసికంలో అంచనాలకుమించి లాభాలు వచ్చాయని, గత మూడు త్రైమాసికాలుగా సర్వీసెస్ బిజినెస్ నిరాటంకంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు.
డాలర్ రూపంలో కంపెనీ ఆదాయం జనవరి-మార్చి తైమాసికానికిగాను 2,993 మిలియన్ డాలర్లు నమోదైంది.
2021-22లో సర్వీసుల అందించడం ద్వారా 10 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 14.9 శాతం అధికం
ఇంజినీరింగ్ అండ్ ఆర్అండ్డీ సర్వీసెస్ విభాగం 23.7 శాతం వృద్ధిని కనబరిచాయి.
టెలికం, మీడియా, పబ్లిషింగ్అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాలు 20 శాతం వృద్ధిని కనబరుచగా, లైఫ్సైన్సెస్ అండ్ హెల్త్కేర్ వర్టికల్ 18.5 శాతం, తయారీ రంగం 16.6 శాతం, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ 14.3 శాతం పెరిగాయి.
సంస్థకు కొత్తగా 164 క్లయింట్లు జతయ్యారు. వీటిలో 100 మిలియన్ డాలర్ల విలువైన భారీ ఆర్డర్ ఒక్క క్లయింట్నుంచి.
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 8,308 మిలియన్ డాలర్ల విలువైన నూతన ఒప్పందాలు కుదుర్చుకున్నది.
కొత్తగా 39,900 మంది సిబ్బందిని నియమించుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,08,877కి చేరుకున్నారు. వలసలు 21.9 శాతంగా ఉన్నాయి.
రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్ను సంస్థ ప్రకటించింది. దీంతో మొత్తం డివిడెండ్ రూపంలో రూ.44 చెల్లించినట్లు అయింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 12-14 శాతం మధ్యలో వృద్ధిని నమోదుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నది.