Health Insurance | కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు.. కొవిడ్-19 సోకిన వారికి వైద్య చికిత్స అంటే లక్షలే కాదు.. ఆస్తులు కరిగిపోయాయి కూడా.. కరోనా పుణ్యమా? అని అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు ఏ ఆర్థిక భారం పడకుండా చికిత్స పొందడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉపకరిస్తుంది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉంటే.. దవాఖాన, ఔట్ పేషంట్ డిపార్ట్ మెంట్, అంబులెన్స్ సహా పలు ఖర్చులు ఇన్సూరెన్స్ కవరేజీ కింద పొందొచ్చు. 60 ఏండ్లు వచ్చే వరకు ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ ప్రకారం టాక్స్ బెనిఫిట్లు కూడా పొందవచ్చు. లేదా, మీ తల్లిదండ్రులకు కూడా బీమా పాలసీ తీసుకుంటే ఈ సెక్షన్ కింద ఆదాయం పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు.
ఎమర్జెన్సీలో ఖరీదైన వైద్య చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపకరిస్తుంది. ఖర్చు గురించి ఆలోచించకుండా సకాలంలో మెరుగైన ట్రీట్మెంట్ పొందే చాన్స్ ఉంటది. ఇది ఆరోగ్యంపై ఎటువంటి ఒత్తిడి లేకుండా త్వరితగతిన కోలుకోవడానికీ పరోక్షంగా సహకరిస్తుంది. ఒక్కరు అనారోగ్యానికి గురైనా కుటుంబం అంతా ఆర్థిక కష్టాల్లోకి జారుకునే ముప్పు పొంచి ఉంటది. కనుక ప్రతి ఒక్కరికీ సరిపడా హెల్త్ బీమా కవరేజీ ఉండటం చాలా అవసరం.
కరోనా తర్వాత దేశలో హృద్రోగ, శ్వాసకోశ సంబంధ ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటి చికిత్స అంటే ఖర్చు ఎంతో ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ ఖర్చు భరించలేవు. మనుష్యుల ఆయుర్దాయం కూడా పెరుగుతున్నది.. తదనుగుణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. దేశంలో పలు రకాల ఇన్సూరెన్స్ సంస్థలు రకరకాల పాలసీలు ఇస్తున్నాయి. వాటిల్లో మంచి పాలసీని ఎంచుకుని తీసుకోవడం మంచిదని ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారత్లో 25 శాతం అకాల మరణాలు గుండె సంబంధ వ్యాధులతోనే వస్తున్నాయని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ నివేదికలో వెల్లడించింది. క్యాన్సర్, మధుమేహం, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలూ కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆయా సమస్యలకు కవరేజీ లభించేలా బీమా పాలసీ తీసుకోవాలి. వాటికి వెంటనే బీమా రాకున్నా.. వెయిటింగ్ పీరియడ్ ముగియగానే ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. కనుక మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలో ఈ అంశం ఉండేలా చూసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మామూలుగానైతే దవాఖానల్లో చికిత్సకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. కొన్ని రకాల మొండి వ్యాధులకు హోమియోపతి, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ మెరుగైన ఫలితాలిచ్చే అవకాశాలున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో 82 శాతం మందిని దీర్ఘకాలిక సమస్యలే వెంటాడుతున్నాయని 2018లో జరిగిన ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది. వీరిలో 76 శాతం మంది రోగులు ఆయుర్వేదం వల్ల పాక్షికంగా, పూర్తిగా రిలీఫ్ పొందారు.
కనుక మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఆయుష్ చికిత్సలకు కవరేజీ ఉండాలి. ఆయుర్వేదంతోపాటు యోగా, నేచురోపతి, యునానీ, సిద్ద, హోమియోపతి చికిత్సా మార్గాలను ఆయుష్గా వ్యవహరిస్తారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎటువంటి చికిత్స తీసుకున్నా.. టైం ప్రకారం చేతికి డబ్బు అందుతుంది.
ప్రభుత్వ దవాఖానలతో పోలిస్తే ప్రైవేట్ దవాఖానల్లో క్షణాల మీద చికిత్స చేసేస్తారు. కనుక చాలా మంది ప్రైవేట్ దవాఖానలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స అంటే మనీ మంచినీళ్లలా ఖర్చు చేయాల్సిందే. కనుక దేశంలోని దవాఖానలన్నీ మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నెట్ వర్క్ పరిధిలోకి వచ్చేలా చూసుకోవాలని ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు.