న్యూడిల్లీ : భారత్ నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఆవిర్భవిస్తాయని ఆశించలేమని నాస్కామ్ తొలి అధ్యక్షుడు, సీనియర్ ఐటీ నిపుణులు హరీష్ మెహతా పేర్కొన్నారు. దేశంలో ఇందుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పాటు తక్కువ తలసరి ఆదాయం వంటి ఎన్నో సమస్యలు, సవాళ్లు మన ముందున్నాయని అన్నారు.
భారత టెక్నోప్రెన్యూర్లు విలువ ఆధారిత ఉత్పత్తులను సృష్టించడం, పరిశ్రమ నిర్మాణంపై సమయాన్ని వెచ్చించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని పిలుపు ఇచ్చారు. మెహతా ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ఐటీ పరిశ్రమలో ఊహించని స్ధాయిలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సాగిందని అన్నారు.
ఈ మార్పు టెక్నాలజీలో సామర్ధ్య పెంపు పరంగా సవాళ్లను ముందుంచిందని చెప్పారు. అవకాశం, సామర్ధ్యం మధ్య అంతరం భారీగా పెరిగిందని అన్నారు. ఏఐ, మెటావర్స్, 5జీ వంటి విభాగాల్లో మనకు తగిన సంఖ్యలో ప్రోగ్రామర్లు ఉన్నా డిజైనర్లు, ఆర్కిటెక్టులు, అనలిస్టులు వంటి నిపుణులు తగినంతగా లేరని స్పష్టం చేశారు.