Smart Phones | పెరిగిపోతున్న ధరలు.. ద్రవ్యోల్బణంతో ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడం.. మరోవైపు అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు నేపథ్యంలో గత ఆరు నెలలుగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ తగ్గిపోయాయి. 2021 అక్టోబర్-డిసెంబర్తో పోలిస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో 30 శాతం, 2022 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది గత మూడు నెలల్లో 18 శాతం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పడిపోయాయని ఇండస్ట్రీ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ అంచనా వేసింది. జనవరి నుంచి స్మార్ట్ ఫోన్ల సంస్థలు 20 శాతం ఫోన్ల ఉత్పత్తి తగ్గించాయి.
కేవలం భారత్లోనే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు పడిపోలేదని జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పారు. పలు స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు సొంతంగా రిటైల్ సేల్స్ నిర్వహిస్తున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్లకు గిరాకీ తగ్గడంతోపాటు ఇతర వత్తిళ్లు కొనసాగడంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు ఉత్పత్తి కూడా తగ్గించాయన్నారు. ఇదే పరిస్థితి ఇక ముందు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందన్నారు.
స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిలో కోత విధించడం ఇదే తొలి సారి కాదని పలు సంస్థల ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు గతేడాది ఏప్రిల్-జూలై, దీపావళి తర్వాత కూడా ఫోన్ల ఉత్పత్తిలో కోత విధించాయని అంటున్నారు. కానీ ఉత్పత్తిలో కోత కేవలం 5-10 శాతం మాత్రమేనంటున్నారు.
ఇదిలా ఉంటే ఐటీ విడి భాగాలు, పర్సనల్ కంప్యూటర్లకు దేశీయంగా గిరాకీ యధాతథంగా కొనసాగుతున్నదని ఇండస్ట్రీ రీసెర్చర్ జీఎఫ్కే పేర్కొంది. కరోనా మహమ్మారి వేళ వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి రావడంతో పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.