Hallmark for Gold | న్యూఢిల్లీ, మార్చి 6: ఇప్పటికే బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇకపై ఆభరణాల తయారీకి అవసరమయ్యే ముడి బంగారంపై హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) ముద్ర వేయాలన్న నిబంధనను ప్రవేశపెట్టనుంది. సోమవారం నాడిక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్కుమార్ తివారీ మీడియాతో మాట్లాడుతూ గోల్డ్ బులియన్కు హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం గత నెలలో ఒక అడ్వయిజరీ గ్రూప్ను ఏర్పాటు చేశామన్నారు.
జ్యువెలరీ తయారీకి ముడి పదార్థంగా వాడే బంగారం స్వచ్ఛత ఖచ్చితత్వం ముఖ్యమైనదని, హాల్మార్క్ చేసిన బంగారం ద్వారా తయారైన ఆభరణాలు నిర్దేశిత స్వచ్ఛతకు హామీగా ఉంటాయని తివారీ తెలిపారు. 2022 జూలై 1 నుంచి ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేసినప్పటి నుంచి 18 కోట్లకుపైగా హాల్మార్క్డ్ పీసుల విక్రయం జరిగిందన్నారు. వినియోగదారులు తమ వద్దనున్న పాత ఆభరణాల్ని విక్రయించుకోవచ్చని, కొత్తవాటికి మార్పిడి చేసుకోవచ్చని డైరెక్టర్ జనరల్ వివరణ ఇచ్చారు. 2023 మార్చి 31 తర్వాత హాల్మార్కింగ్ లేని బంగారు ఆభరణాలు, బంగారు వస్తువుల విక్రయాన్ని అనుమతించబోమని గతవారాంతంలో కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ ప్రకటించింది.