నమ్మకం లేదంటున్న 71 శాతం -లోకల్ సర్కిల్స్ తాజా సర్వే
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలో క్రిప్టోకరెన్సీ (డిజిటల్ కరెన్సీ) చలామణిలోకి వస్తే ఆర్థిక మోసాలు పెరుగుతాయని, సైబర్ సెక్యూరిటీకి ముప్పు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకున్నాకే క్రిప్టోను అనుమతించాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. చివరకు ఆర్బీఐ తాజా, మాజీ గవర్నర్లదీ ఇదే మాట కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ‘ద క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021’ను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించే వీలున్న నేపథ్యంలో దీనిపై ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 342 జిల్లాల్లో 56వేల మంది అభిప్రాయాలను సేకరించారు. అయితే వీరిలో 71 శాతం మంది డిజిటల్ కరెన్సీపై తమకు నమ్మకం లేదన్నారు. 1 శాతం మాత్రమే తమకు ఎక్కువ నమ్మకం ఉందని చెప్పడం గమనార్హం. 6 6శాతం పురుషులు, 34 శాతం స్త్రీలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
క్రిప్టోకరెన్సీపై మీకు నమ్మకం ఉందా?
లేదు: 71 శాతం
మీ కుటుంబంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా?
లేరు: 89 శాతం
క్రిప్టోను దేశంలో లీగలైజ్ చేయాలా?
వద్దు కానీ.. పన్ను వేయాలి: 54 శాతం
క్రిప్టోకరెన్సీ ప్రకటనలు విశ్వసనీయంగా ఉన్నాయా?
లేవు: 74 శాతం
ఆర్బీఐనే ఈ డిజిటల్ కరెన్సీని తీసుకురావాలా..?
అవును.. అప్పుడే భద్రత: 51 శాతం