న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వ్యాపారస్తులు నెలవారీ జీఎస్టీ చెల్లింపు జరపకుండా, జీఎస్టీ రిటర్న్ వేయకపోతే, ఆ మరుసటి నెల జీఎస్టీఆర్-1 సేల్స్ రిటర్న్ దాఖలును నిరాకరిస్తారు. ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ జీఎస్టీ రూల్ 59(6)ని సవరించాలని శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. సవరించిన నిబంధన ప్రకారం జీఎస్టీఆర్-3బీ ఫారమ్ ద్వారా రిటర్న్ వేయకపోతే, ఆ తర్వాతి నెలలో జీఎస్టీఆర్-1 ఫారమ్ దాఖలు చేయడాన్ని అనుమతించరు. వ్యాపారస్తులు నెలకు చెల్లించాల్సిన మొత్తాన్ని జీఎస్టీఆర్-3బీ ఫారమ్లో తెలియపర్చి, ఆ మొత్తాన్ని గడువులోగా చెల్లించాల్సిఉంటుంది. నెలలో జరిగిన అమ్మకాల వివరాల్ని తెలియపర్చేందుకు జీఎస్టీఆర్-1 ఫారమ్ను దాఖలు చేస్తారు. నెలలో జరిగిన అమ్మకాల వివరాల్ని, ఆ తదుపరి నెలలో 11వ తేదీలోగా జీఎస్టీఆర్-1 రిటర్న్ ద్వారా తెలియపరుస్తారు. ఆ తర్వాతి నెలలో 20-24 తేదీల మధ్య జీఎస్టీఆర్-3బీని వేసి, జీఎస్టీని చెల్లిస్తారు.
జీఎస్టీ రిఫండ్స్ క్లయిం చేయడానికి, క్యాన్సిల్ చేసుకున్న రిజిస్ట్రేషన్ను పునరుద్దరించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ధృవీకరణను కౌన్సిల్ తప్పనిసరి చేసింది. 2020 ఆగస్టు 21న కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ధృవీకరణను వ్యాపారులివ్వకపోతే, వ్యాపారం జరిగే ప్రాంతాన్ని భౌతికంగాచూసి, నిర్దారించుకున్న తర్వాత రిజిష్టర్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్తో ఆధార్ను తప్పనిసరిగా లింక్ చేసే నిబంధనను కౌన్సిల్ ఆమోదించింది. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్తో లింక్ అయిఉన్న ప్యాన్ నంబరు కలిగిన బ్యాంక్ ఖాతాలోనే జీఎస్టీ రిఫండ్స్ వేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.