GST | టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.5 లక్షల వరకూ ఆరోగ్య బీమా పథకాలపై అందరికీ జీఎస్టీ రద్దు చేయాలని పేర్కొంది. అయితే రూ5. లక్షలు దాటిన ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. వచ్చేనెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హెల్త్ బీమా పాలసీలు, టర్మ్ జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీ తగ్గింపు, మినహాయింపు విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నది.
ఇక కొన్ని వస్తువులపై జీఎస్టీ వసూళ్లను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించింది. తాగునీరు, సైకిళ్లు, ఎక్సర్సైజ్ నోట్ బుక్లు, లగ్జరీ రిస్ట్ వాచీలు, బూట్లపై తగ్గించాలని సూచించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింక్ వాటర్ మీద జీఎస్టీ 18 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం కోరింది. జీఎస్టీ జీఓఎం సిఫారసులను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తే సైకిళ్లపై 12 నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గి రూ.10 వేల లోపు ధరకు దిగి వస్తాయి. ఎక్సర్సైజ్ నోట్ బుక్లపై జీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం ప్రతిపాదించింది. ఇక రూ.25 వేల పై చిలుకు ధర గల లగ్జరీ రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 నుంచి 28 శాతానికి పెంచాలని సూచించింది. రూ.15 వేల పై చిలుకు విలాసవంతమైన బూట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచాలని పేర్కొంది.