GST Record in April | జీఎస్టీ వసూళ్లలో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. ఏప్రిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్రం తెలిపింది. గతేడాది జూలై నుంచి రూ.1.10 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి. గతనెలలో రూ.1.42 లక్షల కోట్ల పై చిలుకు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్ నెలతో పోలిస్తే 20 శాతం ఎక్కువ.
ఈ ఏడాది మార్చితో పోలిస్తే రూ.25 వేల కోట్లు జీఎస్టీ వసూలైందని ఆర్థిక శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్ను ఆదాయం 30 శాతం ఎక్కువ. దేశీయ లావాదేవీల (దిగుమతి సేవలతోపాటు) పై పన్ను వసూళ్లు 17 శాతం ఎక్కువ.
గత మార్చిలో 77 మిలియన్ల ఈ-వే బిల్లు జనరేట్ అయ్యాయి. 2022 ఫిబ్రవరి (68 మిలియన్ల ఈ-వే బిల్లులు) తో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ శరవేగంగా రికవరీ అవుతున్నదని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.33,159 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.41,793 కోట్లు, ఐజీఎస్టీ రూ.81,939 కోట్లు (వస్తువుల దిగుమతిపై సుంకం రూ.36,705 కోట్లతో కలిపి), సెస్ (దిగుమతి వస్తువులతోపాటు) రూ.10,649 కోట్లు వసూలైంది. పన్నులు సక్రమంగా, సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవడం వల్లే జీఎస్టీ వసూళ్లు పెరిగాయని ఆర్థికశాఖ వెల్లడించింది.