హైదరాబాద్,జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మారెట్ అనే నినాదంతో ప్రవేశపెట్టిన జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందని, పాత పన్నుల విధానంలో ఉన్న సంక్లిష్టతలను తొలగించి, పారదర్శకమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఇది ఆవిషరించిందని సీజీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ రాకేశ్ గోయల్ అన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…
ఈరోజు దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయని, ఈ నిధులే దేశ మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఇంధనంగా మారుతున్నాయని అన్నారు. పన్ను అనగానే చాలామంది అదో పెద్ద సంక్లిష్టమైన ప్రక్రియ అనుకుంటారు.. కానీ జీఎస్టీ ముఖ్య ఉద్దేశం సరళీకరణ మాత్రమేనని, టెక్నాలజీని ఉపయోగించి ఈ-ఇన్వాయిస్, ఈ-వే బిల్లులతో మానవ తప్పిదాలు, అవినీతిని అరికట్టగలిగామని తెలిపారు. ఈ నూతన పన్ను విధానం రాకతో సరికొత్తగా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని, జీఎస్టీ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొన్నదన్నారు.