GST Rates | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: బెల్లం పాకం, పెన్సిల్ షార్పనర్లు సహా కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించింది. శనివారం కౌన్సిల్ 49 సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ బెల్లం పాకం జీఎస్టీని 18 శాతం నుంచి తగ్గించాలని జీఎస్టీ కమిటీ నిర్ణయించిందని, దానిని లూజుగా విక్రయిస్తే జీరో సుంకం ఉంటుందని, ప్యాకింగ్తో లేబుల్తో విక్రయిస్తే 5 శాతం పన్ను వర్తిస్తుందని వివరించారు. పెన్సిల్ షార్పనర్లపై సుంకం 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుందన్నారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంటైనర్పై ఫిక్స్ చేసిన డాటా లాగర్ లేదా ట్యాగ్-ట్రాకింగ్ డివైస్పై ప్రత్యేకంగా ఐజీఎస్టీ ఉండదు. కోల్ వాషరీ తదితర బొగ్గు ఉప ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించారు. పాన్మసాలా, గుట్కా పరిశ్రమ పన్ను ఎగవేతను అరికట్టడం, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునళ్లపై ఆయా మంత్రుల కమిటీలు సమర్పించిన సిఫార్సులను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుందని సీతారామన్ తెలిపారు.
రిటర్న్లపై ఆలస్య రుసుం హేతుబద్దీకరణ
ఫారం జీఎస్టీఆర్-9 వార్షిక రిటర్న్ల్ని ఆలస్యంగా దాఖలు చేస్తే విధించే ఆలస్య రుసుంను కౌన్సిల్ హేతుబద్దీకరించింది. రూ. 20 కోట్ల వరకూ వార్షిక టర్నోవర్ కలిగినవారికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి సవరించిన రుసుం వర్తిస్తుంది. ఇందులో రూ.5 కోట్ల వరకూ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యక్తులకు రోజుకు రూ. 50 చొప్పున, టర్నోవర్లో గరిష్ఠంగా 0.04 శాతానికి లోబడి ఆలస్య రుసుం విధిస్తారు. రూ.5 కోట్లకుపైబడి రూ.20 కోట్ల వరకూ టర్నోవర్ కలిగినవారికి టర్నోవర్లో గరిష్ఠంగా 0.5 శాతానికి లోబడి రోజుకు రూ. 200 చొప్పున ఆలస్య రుసుం ఉంటుంది. ఫారం జీఎస్టీఆర్-4, ఫారం జీఎస్టీఆర్-9, ఫారం జీఎస్టీఆర్-10లకు సంబంధించిన పెండింగ్ రిటర్న్లపై ఆమ్నెస్టీ స్కీమ్లను కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని ప్రకారం షరతులకు లోబడి ఆలస్య రుసుం రద్దు/తగ్గింపు ఉంటుంది.
రాష్ర్టానికి రూ.548 కోట్ల జీఎస్టీ పరిహారం
రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంలో 2022 జూన్నాటికి ఉన్న పెండింగ్ బ్యాలెన్స్ రూ.16,982 కోట్లను కేంద్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి చెల్లించాలని నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీంతో తెలంగాణకు రూ. 548 కోట్ల పరిహారం అందనున్నది. రాష్ర్టాలకు చెల్లిస్తున్న ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వసూలయ్యే పరిహారపు సెస్ నుంచి రికవరీ చేసుకుంటామన్నారు. కాగా, ఈ చెల్లింపుతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేండ్లకు రాష్ర్టాలకు ఇవ్వాల్సిందంతా ఇచ్చినట్టు అవుతుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు రూ. 689 కోట్ల పరిహారం అందనున్నది.