న్యూఢిల్లీ, నవంబర్ 1: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పన్నుల ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, పండుగ సీజన్ కూడా తోడవడంతో గత నెల రూ.1.72 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.1.87 లక్షల కోట్ల తర్వాత ఇదే గరిష్ఠం.
ఇక నిరుడు అక్టోబర్ పన్ను వసూళ్ళతో పోలిస్తే 13 శాతం పెరిగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. సెప్టెంబర్లో 1.63 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల స్థాయిలో వసూలైనట్టయింది. ఇదిలావుంటే గత నెల జరిగిన రూ. 1,72,003 కోట్ల వసూళ్లలో రూ. 30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీగా, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీగా, రూ.91,315 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా, రూ.12,456 కోట్లు సెస్ రూపంలో వచ్చాయి.