న్యూఢిల్లీ, ఏప్రిల్ 1:జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాదిక్రితం ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే 15 శాతం అధికమని పేర్కొంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో ఇంతటి స్థాయిలో వసూళ్ళు అవడం ఇదే తొలిసారి. మార్చి నెలలో వసూలైన రూ.1,42,095 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.25,830 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.32,378 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.74,470 కోట్లు(దిగుమతైన వస్తువులపై విధించిన రూ.39,131 కోట్లు కలుపుకొని), సెస్ రూ.9,417 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో వసూలైన రూ.1,40,986 కోట్ల రికార్డు వసూళ్ళు దీంతో తుడిచిపెట్టుకుపోయింది. గడిచిన త్రైమాసికంలో సరాసరిగా రూ.1.38 లక్షల కోట్ల మేర పన్ను వసూలయ్యాయి. తొలి త్రైమాసికంలో రూ.1.10 లక్షల కోట్లు, రెండో క్వార్టర్లో 1.15 లక్షల కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.1.30 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. ఆర్థిక రంగం కోలుకోవడం, పన్ను ఎగవేతలు తగ్గుముఖం పట్టడం, మోసపూరిత బిల్లులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం సత్ఫలితాలను ఇచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, సెంట్రల్ జీఎస్టీ కింద రూ.29,816 కోట్లు, ఐజీఎస్టీ కింద వసూలైన దాంట్లో రూ.25,032 కోట్లను రాష్ర్టాలకు చెల్లింపులు జరిపింది.