GST | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి.
ఈ పన్ను అమల్లోకి వచ్చిన తర్వాతే ఇదే గరిష్ఠ స్థాయి. ఈ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం. ఒక్కో నెలలో 1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి.
గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది.