న్యూఢిల్లీ, జనవరి 1: కొద్ది కాలంగా ప్రతీ నెలా పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు డిసెంబర్ నెలలో హఠాత్తుగా తగ్గాయి. ఈ నెలలో వస్తు, సేవల పన్నుల వసూళ్లు మూడు నెలల కనిష్ఠస్థాయి 1.65 లక్షల కోట్లకు పడిపోయాయి. 2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో వసూళ్లు 10 శాతం పెరిగినప్పటికీ, అక్టోబర్, నవంబర్ నెలలతో పోలిస్తే క్షీణించినట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 అక్టోబర్లో రూ. 1.72 లక్షల కోట్లు, నవంబర్లో రూ.1.68 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి.
2022 డిసెంబర్లో ఈ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు. 2023 డిసెంబర్లో వసూలైన రూ.1.65 లక్షల కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.30,443 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.37,935 కోట్లు, ఇంటర్నేషనల్ జీఎస్టీ రూ.84,255 కోట్లు (వస్తూత్పత్తుల దిగుమతుల ద్వారా వచ్చిన రూ.41,534 కోట్లతో కలుపుకుని) సమకూరాయి. రూ.11,249 కోట్లు సెస్ల రూపంలో వసూలయ్యింది. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ జీఎస్టీ వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.14.97 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ తొమ్మిది నెలల కాలంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ.1.49 లక్షల కోట్ల సగటు వసూళ్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందాయి.
ఎల్ఐసీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు దాదాపు రూ.806 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) డిమాండ్ నోటీసు అందింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ చెల్లింపులు తక్కువగా చేశారంటూ సంబంధిత పన్ను అధికారుల నుంచి ఈ నోటీసు వచ్చినట్టు సోమవారం ఎల్ఐసీ తెలియజేసింది. జీఎస్టీ బకాయి, దాని వడ్డీ, జరిమానా అన్నీ కట్టాలని సదరు నోటీసులో ట్యాక్స్ అథారిటీస్ పేర్కొన్నట్టు రెగ్యులేటరీలకు ఎల్ఐసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, ఈ ఆదేశాలపై నిర్దేశిత వ్యవధిలోగా అప్పీల్స్ కమిషనర్కు అప్పీల్ చేసుకోవచ్చని సంస్థ చెప్తున్నది. తాజా నోటీసులతో సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై లేదా ఇతరత్రా కార్యకలాపాలపై ఏ రకమైన ప్రభావం ఉండబోదని ఎల్ఐసీ వెల్లడించింది.
తెలంగాణలో వసూళ్లు రూ.4,753 కోట్లు
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో తగ్గాయి. అయితే 2022 డిసెంబర్ వసూళ్లకంటే 14 శాతం పెరిగాయి. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో రూ.4,753 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇదే ఏడాది నవంబర్లో వసూళ్లు రూ.4,986 కోట్లుకాగా, 2022 డిసెంబర్లో ఇవి రూ.4,178 కోట్లుగా ఉన్నాయి.