న్యూఢిల్లీ, జూలై 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.31,013 కోట్లుగా, స్టేట్ జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లు (దిగుమతైన గూడ్స్పై వసూలు చేసిన రూ.39,035 కోట్లుసహా), సెస్సు రూ.11,900 కోట్లు (దిగుమతైన గూడ్స్పై వసూలు చేసిన రూ.1,028 కోట్లుసహా)గా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్ల నుంచి సెంట్రల్ జీఎస్టీకి రూ.36,224 కోట్లు, స్టేట్ జీఎస్టీకి రూ.30,269 కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. కాగా, దిగుమతి, సర్వీసులుసహా దేశీయ లావాదేవీల నుంచి ఈ జూన్లో రెవిన్యూ గత ఏడాది జూన్తో పోల్చితే 18 శాతం పెరిగినట్టు తేలింది.
జీఎస్టీ సమీక్ష అవసరం: ట్రేడర్లు
జీఎస్టీ విధానాన్ని మరోమారు సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అభిప్రాయపడింది. ఈ పరోక్ష పన్ను విధానాన్ని ఇంకా సరళతరం చేయాలని, హేత్తుబద్దీకరించాలని సూచించింది. ముఖ్యంగా జీఎస్టీ కింద ట్రేడర్లపై వివిధ చట్టాలు, నిబంధనలతో వచ్చిపడుతున్న భారాన్ని తగ్గించేలా ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు.
రూ.25వేల కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిములు
గడిచిన ఆరేండ్లలో జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా 304 సిండికేట్ మోసాలను బట్టబయలు చేశారు. ఈ కేటుగాళ్లు నకిలీ సంస్థల ప్రమేయంతో 9వేల మోసపూరిత జీఎస్టీఐఎన్లను సృష్టించారని, రూ.25వేల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిములకు పాల్పడ్డారని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ తెలిపారు. 2017 జూలై 1న దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారంతో ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘జీఎస్టీ డే 2023’ కార్యక్రమంలో జోహ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్లో 1.39 లక్షల వ్యాపారులు జీఎస్టీ కింద నమోదైనట్టు చెప్పారు.
తెలంగాణలో 20% పెరుగుదల
రాష్ట్రంలో గత నెల జీఎస్టీ రెవిన్యూలో గత ఏడాది జూన్తో పోల్చితే 20 శాతం వృద్ధి నమోదైంది. నిరుడు జూన్లో రూ.3,901.45 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది జూన్లో జీఎస్టీ రెవిన్యూ రూ.4,681. 39 కోట్లుగా ఉన్నది. ఇక ఈ జూన్ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లలో స్టేట్ జీఎస్టీ వాటా కింద తెలంగాణకు కేంద్రం రూ.1,621. 37 కోట్లు చెల్లించింది.