న్యూఢిల్లీ, జూన్ 1: జీఎస్టీ వసూళ్లు ఈ మే నెలలో రూ.1.41లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదేనెలతో పోలిస్తే 44 శాతం వృద్ధిచెందాయి. 2021 మే నెలలో ఇవి రూ.97,821 కోట్లు. అయితే 2022 ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయిలో వసూలైన రూ.1.68 లక్షల కోట్లకంటే తక్కువ. వరుసగా రెండు నెలలపాటు మార్చి, ఏప్రిల్లో వృద్ధిచెందిన వసూళ్లు మే నెలలో తగ్గడం గమనార్హం. ఫిబ్రవరిలో రూ.1.33 లక్షల కోట్లు వసూలుకాగా, మార్చిలో అంతకంటే అధికంగా రూ.1.42 లక్షల కోట్లు నమోదయ్యాయి. 2022 మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,40,885 కోట్లని, అందులో సీజీఎస్టీ రూ.25,036 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.32,001 కోట్లు, ఐజీఎస్టీ రూ.73,345 కోట్లని (దిగుమతులపై వసూలైన రూ.37,469 కోట్లు కలుపుకొని) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. 2017లో కొత్త పన్నుల విధానం జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత రూ.1.40 లక్షల కోట్ల మార్క్ను దాటడం ఇది నాల్గవసారి.
తెలంగాణలో వసూళ్లు రూ.3,982 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో రూ.3,982 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నిరుడు మేలో వసూలైన రూ.2,984 కోట్ల కంటే 33 శాతం అధికంగా గడిచిన నెలలో నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయిలో రూ. 4,955 కోట్లు వసూలైన సంగతి తెలిసిందే.