న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలకుగాను రూ.1.43 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,12.020 కోట్లతో పోలిస్తే 28 శాతం అధికం. అధిక రేట్లు, ఎగగొట్టే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం, డిమాండ్ అధికంగా ఉండటంతో వరుసగా ఆరో నెలలోనూ రూ.1.4 లక్షల కోట్ల కంటే అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్ కూడా తోడవడంతో వచ్చే నెలల్లోనూ ఇంతకంటే పెరిగే అవకాశం ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. గత నెలకుగాను వసూలైన రూ.1,43,612 కోట్ల జీఎస్టీలో సీజీఎస్టీ కింద రూ.24,710 కోట్లు వసూలవగా, అలాగే స్టేట్జీఎస్టీ కింద రూ.30,951 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.77,782 కోట్లు(దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన రూ.42,067 కోట్లు కలుపుకొని), సెస్ రూపంలో రూ.10,168 కోట్లు(దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన రూ.1,018 కోట్లు కలుపుకొని) వచ్చాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్టీ వసూళ్ళను పెంచడానికి తీసుకుంటున్న చర్యల వల్లనే గత ఆరు నెలలుగా రూ.1.4 లక్షల కోట్ల కంటే అధికంగా నమోదవుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. జూలై నెలలో వసూలైన రూ.1.49 లక్షల కోట్ల కంటే తక్కువగా నమోదవడం విశేషం. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణలో 3,871 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో రూ.3,871 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.3,526 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణ పొరుగు రాష్ట్రమైన ఏపీలో రూ.3,173 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో రూ.18,863 కోట్లు వసూలవగా, ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక రూ.9,583 కోట్లతో నిలిచింది.