న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : గత కొన్ని నెలలో దూసుకుపోయిన కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. జనవరి నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అలాగే డిసెంబర్ 2025లో నమోదైన 4.7 శాతం కంటే తక్కువగా నమోదు కావడం విశేషం. క్రూడాయిల్, సహజ వాయువు ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్లనే కీలక రంగాల్లో నిస్తేజం ఆవహించిందని పేర్కొంది. అలాగే రిఫైనరీ ఉత్పత్తి స్థిరంగా నమోదైంది. దీంతోపాటు బొగ్గు, సిమెంట్ రంగాల్లో వృద్ధి 3.1 శాతంగాను, 10.7 శాతానికి పరిమితమయ్యాయి.
క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఉత్పత్తి 4.6 శాతం, 14.3 శాతంగా ఉన్నాయి. కానీ, ఎరువులు, స్టీల్, విద్యుత్ ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి 2.8 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది 4.5 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..ఎనిమిది కీలక రంగాల్లో ఏడు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుండటం వల్లనే మందిగించాయన్నారు. కీలక రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా మొత్తం జనవరి నెలకుగాను పారిశ్రామిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. జనవరి నెలలో పారిశ్రామిక వృద్ధి 5.5 శాతంగా ఉంటుందని ఇక్రా అంచనావేస్తున్నది. డిసెంబర్ నెలకుగాను 7.8 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.