Air India Express | టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express)లో పని చేస్తున్న సుమారు 300 మంది క్రూ సిబ్బంది అనారోగ్యం పేరిట మూకుమ్మడి సెలవు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సుమారు 86 విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ (ఎయిర్ ఏసియా ఇండియా) విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సిబ్బందిలో నిరసన, అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. విలీన ప్రక్రియలో ఉద్యోగుల వేతన భత్యాల ప్యాకేజీ, అనుభవం, ప్రతిభను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఉద్యోగ భద్రత కొరవడిందని క్రూ సిబ్బంది అభిప్రాయ పడుతున్నారు.
ఈ విషయమై ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఎక్స్ఈయూ) రెండు పేజీల బహిరంగ లేఖ రాసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఎఈఎక్స్ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతున్నదని ఆ లేఖలో పేర్కొంది. ‘ఉద్యోగ భద్రత, వేతనం, మెయింటెనెన్స్, సీనియారిటీ పట్ల గౌరవం ప్రదర్శించడం లేదు’ అని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనం నుంచి ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసిన రెండేండ్లలోపు ఉద్యోగుల టర్మినేషన్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉద్యోగులను తొలగిస్తున్నారని ఏఐఎక్స్ఈయూ తెలిపింది. విధుల నిర్వహణలో నిష్కళంకమైన రికార్డులు ఉన్న ఉద్యోగులను తొలగించారని గుర్తు చేసింది. పౌర వేగుల పట్ల యాజమాన్యం అణచివేతకు పాల్పడుతున్నదని ఆరోపించింది. దీనివల్ల సిబ్బందిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్నదని వెల్లడించింది. ఎయిర్ ఇండియా చైర్మన్గా జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని చంద్రశేఖరన్ను ఏఐఎక్స్ఈయూ కోరింది.
దాదాపు 300 మంది సీనియర్ క్యాబిన్ క్రూ సిబ్బంది చివరిక్షణంలో అనారోగ్యం పేరుతో సెలవు పెట్టారు. వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ యాజమాన్యం మంగళవారం 86 విమాన సర్వీసులను రద్దు చేసింది. కంపెనీ యాజమాన్యం వైఖరి పట్ల నిరసన తెలుపుతున్న క్యాబిన్ క్రూ సిబ్బందిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు. తమ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వారు బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తిగా రీఫండ్ చేస్తామని, వారం లోపు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చునని తెలిపారు. మరోవైపు, విమాన సర్వీసుల రద్దుకు కారణాలు తెలుపాలంటూ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ యాజమాన్యాన్ని డీజీసీఏ ప్రశ్నించింది. అకస్మాత్గా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు చేయడం పట్ల ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిరసన తెలుపుతున్నారు.