న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. రిటైల్, ఎంఎస్ఎంఈ రంగాల్లో నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరుగుతుండంతో వచ్చే మార్చినాటికి ప్రధాన బ్యాంకుల మొండి బకాయిలు రూ.10 లక్షల కోట్లు దాటవచ్చునని అంచనా. ఇండస్ట్రీ బాడీ అసోచామ్, దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎంఎస్ఎంఈ ఖాతాలు మొండి బకాయిల జాబితాలోకి అధికంగా చేరుతుండగా, మరోవైపు అలాగే కొన్ని ఆస్తులు పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నాయని పేర్కొంది. బ్యాంకుల నిరర్థక ఆస్తులపై ‘రెయిన్ఫోర్సింగ్ ది కోడ్’ పేరుతో సర్వే నిర్వహించారు.
మొండి బకాయిల జాబితాలో ఎప్పుడూ అతిపెద్ద ఖాతాలే ఉంటుండగా..ఈసారి మాత్రం చిన్న స్థాయి ఖాతాలు అధికంగా ఉండనున్నాయని పేర్కొంది. వీటిలో ఎంఎస్ఎంఈ, రిటైల్ రంగాలవే ఎక్కువ. గత కొన్నేండ్లుగా అతిపెద్ద ఖాతాలు పునర్వ్యవస్థీకరించడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ఎంఎస్ఎంఈ, చిన్న స్థాయి రుణాలు తీసుకున్నవారికోసం ప్రకటించిన పునర్వ్యవస్థీకరణ స్కీంతో నిరర్థక ఆస్తులు మరింత పెరిగాయి. అలాగే కరోనా వైరస్తో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల జీఎన్పీఏఎస్లు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని సర్వే హెచ్చరించింది. కానీ, మార్చి 2018లో గరిష్ఠ స్థాయిలో ఉన్న బ్యాంకుల జీఎన్పీఏ..గత మార్చి నాటికి భారీగా తగ్గడం విశేషం. దేశీయ బ్యాంకుల్లో ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు రిస్క్ నుంచి బయటపడ్డాయని వెల్లడించింది.