రామగుండం-మణుగూరు రైల్వేలైన్ భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ నాలుగు జిల్లాలను కలుపుతూ 207 కిలోమీటర్ల లైన్
పెద్దపల్లి, మే 22(నమస్తే తెలంగాణ): సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాలను కలుపుతూ కోల్కారిడార్ రైల్వేమార్గం నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 25 ఏండ్లుగా హామీలు, సర్వేలు, ప్రతిపాదనలు, పరిశీలనలతో కాగితాలకే పరిమితమైన రామగుండం-మణుగూరు రైల్వే లైన్కు బుధవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వే డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో లైన్ను నిర్మించినప్పటికీ సరుకు రవాణా విషయంలో మాత్రం గంటల కొద్దీ జాప్యం జరుగుతున్నది. ఫలితంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనికి పరిష్కారంగా సింగరేణి గోదావరి పరీవాహక ప్రాంతాలైన పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ కోల్కారిడార్ నిర్మించాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. 25 ఏండ్ల క్రితం 1999లోనే పెద్దపల్లి మండలం రాఘవాపూర్ మీదుగా మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా మణుగూరు వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సర్వేలు, భూ పరీక్షలు చేసి కోల్కారిడార్గా పేరు పెట్టింది. గతంలో రూ.10కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ముందుకుసాగలేదు. ఈ మార్గంలో మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాల్రావ్పేటల్లో స్టేషన్లను గుర్తించి, ప్రాథమికంగా అంచనా వేయగా, తాజాగా ఈ లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.