Go First | నిధుల కొరతను ఎదుర్కొంటున్న ‘గోఫస్ట్’ విమానయాన సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. అందుకోసం భాగస్వాములందరితోనూ సంప్రదిస్తామని తెలిపారు. వాడియా గ్రూప్ ఆధ్వర్యంలోని ‘గోఫస్ట్’ ఎయిర్ లైన్స్.. సర్వీసుల నిర్వహణకు నిధుల కొరతను ఎదుర్కోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద ‘గోఫస్ట్’ స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసిందని తమకు సమాచారం ఉందన్నారు. న్యాయ ప్రక్రియలో తుది నిర్ణయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందేనన్నారు.
నిధుల కొరతతో సతమతం అవుతున్న ‘గోఫస్ట్’ ఎయిర్ లైన్స్ ఈ నెల 3,4,5 తేదీల్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణాపరమైన కారణాల వల్ల విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేసినందుకు ప్రయాణికులకు క్షమాపణ తెలిపింది. వారికి జరిగిన అసౌకర్యానికి మన్నించాలని అభ్యర్థించింది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి మనీ పూర్తి స్థాయిలో త్వరలో రీఫండ్ చేస్తామని తెలిపింది. గమ్మత్తేమిటంటే దేశీయ విమానయాన సంస్థల్లో గోఫస్ట్ మూడో స్థానంలో ఉంది.
ప్రాట్ అండ్ విట్నీ (పీడబ్ల్యూ) సంస్థ నుంచి తమ విమానాలకు ఇంజిన్ల సరఫరాలో జాప్యం వల్లే నిధుల కొరత తలెత్తిందని గోఫస్ట్ సీఈఓ కౌశిక్ కోనా వెల్లడించారు. దీంతో తమ 28 విమానాలు నిలిచి పోయాయన్నారు. కంపెనీ దివాళా పరిష్కార ప్రక్రియ కోరడం దురదృష్టకరం అని చెప్పారు. సంస్థ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ విషయమై పూర్తి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకు సమర్పించామన్నారు. తమ పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆమోదించగానే విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామని కౌశిక్ కోనా తెలిపారు.
గోఫస్ట్ ఎయిర్ లైన్స్ 55 విమాన సర్వీసులు నడుపుతున్నది. దేశీయ విమానయాన మార్కెట్లో గోఫస్ట్ సంస్థకు 6.9 శాతం వాటా ఉంది. సంస్థకు చెందిన సగానికి పైగా విమానాల్లో ఇంజిన్ లోపం వల్లే కొంత కాలంగా నిలిచిపోయాయి. ఒప్పందానికి అనుగుణంగా పీడబ్ల్యూ సంస్థ ఇంజిన్లు సరఫరా చేయకపోవడమే దీనికి కారణం అని తెలుస్తున్నది. దీనిపై అమెరికాలోని డెలావర్ ఫెడరల్ కోర్టులో గోఫస్ట్ పిటిషన్ కూడా వేసినా.. పరిష్కారం లభించలేదు. తమ వద్ద ఇంజిన్లు అందుబాటులో లేవని పీడబ్ల్యూ సంస్థ పేర్కొనడం గమనార్హం. దీంతో తాత్కాలికంగా రెండు రోజుల పాటు విమాన సర్వీసులు నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నది. గోఫస్ట్ సంస్థలో సుమారు 5000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.