GPS Toll System | జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూలు చేసే విషయమై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మరో ఆరు నెలల్లో టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు వసూలు చేయడానికి జీపీఎస్-ఆధారిత సిస్టమ్ అమల్లోకి తెస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ ఫీజు చెల్లింపుల్లో అమల్లోకి తెస్తామన్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, సమస్యలు తప్పడంతోపాటు సంబంధిత వాహనాలు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు వసూలు చేయడం సాధ్యం అవుతుందని సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో శుక్రవారం గడ్కరీ తెలిపారు.
ఇప్పుడు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి ప్రతి సంవత్సరం టోల్ ఫీజు వసూళ్ల రూపేణా రూ.40 వేల కోట్ల రాబడి లభిస్తున్నదని, వచ్చే మూడేండ్లలో అది రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. ప్రస్తుతం వెహికిల్ నిలపకుండా నంబర్ ప్లేట్ రీడింగ్ ప్రాజెక్టును రవాణాశాఖ అమలు చేస్తున్నది. 2018-19 నాటికి టోల్ గేట్ల వద్ద ఒక్కో వెహికల్ సరాసరి ఎనిమిది నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చేదన్నారు. కానీ, ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక ఆ సమయం 47 సెకన్లకు తగ్గిపోయిందన్నారు. ఇప్పటికీ కూడా నగర శివార్లలో రద్దీ వేళ్లలో వెహికల్స్ ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తున్నది.
జమ్ముకశ్మీర్లో గుర్తించిన లిథియం నిల్వలను మనం సమర్థవంతంగా వాడుకుంటే ఆటోమొబైల్ సెక్టార్లో భారత్ మొదటి స్థానానికి చేరుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. ఇప్పుడు దేశీయ అవసరాల రీత్యా 1200 టన్నుల లిథియం భారత్ దిగుమతి చేసుకుంటున్నది. 2022లోనే జపాన్ తర్వాత ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ మూడో స్థానానికి చేరుకున్నదని గడ్కరీ అన్నారు. దేశంలోని లిథియం నిల్వలు సరిగ్గా వాడుకుంటే అమెరికా, చైనాలను దాటేస్తుందన్నారు.