న్యూఢిల్లీ : 2023-24 ఆర్దిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. బడ్జెట్కు ముందు ఆర్ధికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదింపులు జరపనున్నారు. ప్రముఖ వ్యవసాయ నిపుణులు అశోక్ గులాటి, ఐఐఎం ప్రొఫెసర్ సంకేత్ మహాపాత్ర, అసిమా గోయల్, సుర్జిత్ భల్లా వంటి ప్రముఖులతో ఆర్ధిక వ్యవస్ధ స్థితిగతులు, వేగవంతమైన వృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని చర్చించనున్నారు.
ఆర్ధిక మందగమనం నెలకొనడంతో పాటు ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభ భయాలు వెంటాడుతున్న క్రమంలో నిపుణులతో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ధిక వృద్ధి అంచనాలు సైతం ఏడు శాతం దిగువకు పడిపోయిన నేపధ్యంలో వృద్ధిని గాడిన పెట్టే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దిశగా నిపుణులతో కేంద్రం సంప్రదింపులు జరపనుంది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బడ్జెట్ 2023 చివరిది కావడంతో ఈ బడ్జెట్ రూపురేఖలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాగు రంగానికి ఎలాంటి సాయం చేస్తారని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తుండటంతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి ఐదు లక్షలకు పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. సామాన్యుడికి ఊరటనిచ్చే దిశగా కేంద్ర బడ్జెట్ ఉండాలని ధరల పోటుతో కుదేలవుతున్న సగటు జీవి కోరుతున్నాడు.కాగా, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.