Whatsapp | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మీద ఒక యూజర్ సంచలన ఆరోపణలు చేశారు. వాడని టైంలో కూడా బ్యాక్గ్రౌండ్లో మైక్రోఫోన్ పని చేస్తుందని ఫోడ్ డబిరి అనే ఇంజినీర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్.. ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వాట్సాప్ యాప్ నమ్మదగింది కాదంటూ ట్విట్టర్-స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్మస్క్ ట్వీట్ చేశారు. మరోవైపు వాట్సాప్పై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ట్విట్టర్ ఇంజినీర్ ఫోడ్ డబిరి.. తాను నిద్రపోతున్నప్పుడు బ్యాగ్రౌండ్లో మైక్రోఫోన్ను ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. తాను ఉదయం లేవగానే తన ఫోన్ చూసి ఆశ్చర్యపోయానంటూ తన ఆండ్రాయిడ్ డ్యాష్బోర్డ్ స్క్రీన్ షాట్ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘అసలు ఏం జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు. ఎలన్ మస్క్ దీనిపై స్పందిస్తూ వాట్సాప్ నమ్మదగ్గ యాప్ కాదనడంతో ఈ వ్యవహారం వైరల్లైంది.
వాట్సాప్పై ఆరోపణలను తమ ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు సిద్ధమవుతున్నదన్నారు. గతేడాది అక్టోబర్లో వాట్సాప్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయినప్పుడు కూడా కేంద్రం రియాక్టయింది. సేవలు నిలిచిపోవడానికి కారణాలు తెలుపాలంటూ వాట్సాప్ నుంచి వివరణ కోరింది. ఇండియన్ యూజర్లను ఇంటర్నేషనల్ కాల్స్ వేధిస్తున్న టైంలో ఈ వ్యవహారం బయట పడటం ఆసక్తికర పరిణామం.
ఇదిలా ఉంటే, వాట్సాప్లో మైక్రోఫోన్ మీద జరుగుతున్న ప్రచారంపై వాట్సాప్ రియాక్టయింది. ఆండ్రాయిడ్లో బగ్ వల్లే డాష్బోర్డ్లో తప్పుడు సమాచారం చూపుతున్నదని తెలిపింది. యూజర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్నారన్న వాట్సాప్.. దీనిపై దర్యాప్తు చేయాలని గూగుల్ను కోరినట్లు వెల్లడించింది. యూజర్ల చేతిలోనే మైక్రోఫోన్ సెట్టింగ్స్ నియంత్రణ ఉంటుందని పేర్కొన్నది. యూజర్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, వాయిస్ లేదా వీడియో రికార్డింగ్ చేసినప్పుడే మైక్రోఫోన్ పని చేస్తుందని తెలిపింది.