న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఈ ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడుతూ.. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమాను కనబర్చారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉన్నది. ఇందులో అటు కేంద్రం, ఇటు ఎల్ఐసీ కలిసి దాదాపు 61 శాతం వాటాను అమ్మేయాలని చూస్తున్నాయి. ఇక 2022 అక్టోబర్లోనే బిడ్లను ఆహ్వానించగా, నిరుడు జనవరిలో కొంటామని కొందరు ముందుకు వచ్చినట్టు దీపం వర్గాలు చెప్తున్నాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులను కేంద్రం తెచ్చుకో వాల్సి ఉన్నది. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉన్నది.