న్యూఢిల్లీ : గత ఎనిమిదేండ్లుగా దేశంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 56 శాతం తగ్గిందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ గురువారం పార్లమెంట్లో పేర్కొంది. 2014-15లో 2469 కేసుల నుంచి 2020-21లో వీరి కేసుల సంఖ్య ఏకంగా 1063కు తగ్గిందని తెలిపింది. 2019-20లో కేవలం 597 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేసులు వెలుగుచూడగా 2020-21లో ఆ సంఖ్య రెట్టింపైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు శంతను సేన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు తెలిపింది.
రుణగ్రహీత తన రుణాన్ని తిరిగి చెల్లించే స్ధోమత కలిగి ఉన్నా డబ్బును తిరిగి చెల్లించకపోతే అతడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటిస్తారు. బ్యాంక్కు తెలియకుండా నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన కేసులనూ ఈ క్యాటగిరీ కిందకు తీసుకువస్తారు. ఇక 2008లో రూ 25,03,431 కోట్లుగా ఉన్న వాణిజ్య బ్యాంకుల రుణాలు 2014 నాటికి రూ 68,75,748 కోట్లకు ఎగబాకాయని ఆర్బీఐ గణాంకాల ఆధారంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2014తో పోలిస్తే 2015లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఏకంగా 49 శాతానికి ఎగబాకారు. 2021లో ఈ సంఖ్య 8.5 శాతానికి తగ్గింది.
ఇక 2019-20, 2020-21 మధ్య ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య రెట్టింపయింది. ఇక ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి బ్యాంకులు రికవరీ చేసిన మొత్తాలపై తగిన గణాంకాలు లేని కారణంగా ఆ వివరాలు ఆర్బీఐ వద్ద లేవు. నిరర్ధక ఆస్తుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వరుసగా రూ 6,15,146 కోట్లు,135 కోట్లు రాబట్టాయి. ఎస్బీఐకి అత్యధికంగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రూ 67,304 కోట్లు బాకీపడగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వీరు రూ 37,662 కోట్లు బకాయిపడ్డారు.