Gold Rate | బంగారం ప్రియులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. పసిడిపై బేసిక్ దిగుమతి సుంకం 15 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ఓ నోటిఫికేషన్లో తెలిపింది. గురువారం నుంచే పెరిగిన ధర అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల తులం బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1310 పెరిగి రూ.52,200 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు స్వలంగా తగ్గుముఖం పట్టాయి. క్రితం ట్రేడింగ్తో పోలిస్తే ఈ రోజు ట్రేడింగ్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1794 డాలర్లు, ఔన్స్ వెండి ధర 19.76 డాలర్లుగా నిలిచింది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు, ఇతర కమోడిటీల ధరల ప్రభావంతో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ ఈ వారం ఆల్టైం కనిష్ఠ స్థాయి రూ.79లకు పడి, తిరిగి పుంజుకున్నది. దీంతో ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువైంది. ఫలితంగా కరంట్ ఖాతా లోటు (క్యాడ్ – CAD) పెరిగింది. క్యాడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు బంగారం దిగుమతిని నిరుత్సాహ పరిచేందుకు దానిపై దిగుమతి సుంకం పెంచివేసింది. భారత్లో బంగారం వినియోగదారులు పూర్తిగా దిగుమతిపైనే ఆధార పడి ఉంటారు.
మే నెల వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 24.3 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో కేంద్రం వివిధ దిగుమతులపై నిశిత దృష్టి సారించింది. ప్రత్యేకించి బంగారం దిగుమతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. కరంట్ ఖాతా లోటు (క్యాడ్) పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గతేడాదితో పోలిస్తే మే నెలలో బంగారం దిగుమతులు తొమ్మిది రెట్లు పెరిగి 7.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గతేడాది వార్షిక బడ్జెట్లో బంగారంపై సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించింది.
తాజాగా ఐదు శాతం జీఎస్టీ పెంచింది. అయితే దేశీయంగా బంగారం క్రయ, విక్రయాలపై మూడు శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. దీనికి అదనంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 2.5 శాతం వసూలు చేస్తారు. జీఎస్టీ, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్తో కలిపి బంగారం పన్ను 18 శాతానికి చేరినట్లయింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ధర దాదాపు మూడు శాతం పెరిగి రూ.51,900లకు చేరుకున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారం రీసైక్లింగ్లో భారత్కు నాలుగో స్థానం. 2021లో భారత్లో 75 టన్నుల బంగారం (6.5 శాతం) రీ సైక్లింగ్ చేశారు.