Coal India | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం తన వాటాల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా, ఆసియాలో అతిపెద్ద జింక్ తయారీ సంస్థ.. `హిందూస్థాన్ జింక్ లిమిటెడ్`తోపాటు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్లో కేంద్రం వాటా విక్రయానికి కసరత్తు జరుగుతున్నది. ఈ మూడు సంస్థల్లో ఐదు నుంచి 10 శాతం వాటాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కేంద్రం తలపోస్తున్నది. గత ఏడాది కాలంలో కోల్ ఇండియా సుమారు 46 శాతం, రాష్ట్రీయ కెమికల్స్ 58 శాతం వృద్ధి చెందాయి. ఈ రెండు సంస్థల షేర్ల విలువ.. బీఎస్ఈ సెన్సెక్స్లో దాదాపు ఆరు శాతం ఉండొచ్చునని అంచనా. తెలంగాణలోని సింగరేణిలో కోల్ ఇండియాకు వాటాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయానికి పరిపుష్టి కలిగించేలా ఈ మూడు సంస్థల్లో వాటాల ఉపసంహరణకు నిర్ణయించినట్లు సమాచారం. `ఆఫర్ ఫర్ సేల్` అనే విధానం ద్వారా ఈ వాటాల విక్రయం సాగనున్నది. వీటితోపాటు రైల్వేశాఖ పరిధిలోని సంస్థలో వాటా కూడా వదిలించుకునే యోచనలో కేంద్రం ఉంది.
ప్రస్తుత ధరల ప్రకారం ఈ మూడు సంస్థల్లో 5-10 శాతం వాటాలను ఉపసంహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.16,500 కోట్ల (రెండు బిలియన్ల డాలర్లు) ఆదాయం వస్తుందని బ్లూంబర్గ్ అంచనా. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వాటాల విక్రయంతో సబ్సిడీ బిల్లు పెరుగకుండా నివారించాలని కేంద్రం భావిస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ వివిధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.65 వేల కోట్ల నిధులు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ గత మే నెలలో ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.26,500 కోట్ల ( 2.7 బిలియన్ డాలర్ల ) ఆదాయం మాత్రమే సంపాదించింది. ఇక కోల్ ఇండియా తదితర సంస్థల్లో వాటాల విక్రయానికి రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా స్పందించడానికి ఆర్థిక శాఖ ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.