న్యూఢిల్లీ, జూన్ 10: వచ్చే నెలాఖరుకల్లా ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇందులోభాగంగానే ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) అమెరికాలో ఐడీబీఐ బ్యాంక్ విక్రయం కోసం రోడ్షోలనూ నిర్వహిస్తున్నది. మరిన్ని ఈ తరహా కార్యక్రమాల అనంతరం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై తుది నిర్ణయం వస్తుందని సంబంధిత అధికారి ఒకరు చెప్తున్నారు. అయితే ‘ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయంపై ఆర్బీఐతో మరో దఫా చర్చలు అవసరం కావచ్చు’ అన్నారు. కాగా, బ్యాంక్లో ప్రస్తుతం కేంద్రానికి 45.48 శాతం వాటా ఉన్నది. ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలో అమ్మకానికి ఎంత వాటాను తెస్తారన్నదానిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే ఈ విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. చట్టంలో మార్పులనూ చేయగా, లావాదేవీ సలహాదారులనూ నియమిస్తున్న సంగతి విదితమే. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం.. ఆ సంస్థల మూసివేత కానే కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఉత్పత్తి, నిర్వహణలపరంగా ఆయా సంస్థలను పోటీయుతంగా, మరింత ప్రభావవంతంగా చేయడమే అసలు ఉద్దేశమన్నారు.