Budget 2022 | ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా నిధుల సేకరణ అవకాశాలు పరిమితంగా ఉన్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య నియంత్రణ విధానాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నది. ప్రత్యక్ష, పరోక్ష పన్నులతో రెవెన్యూ వసూళ్లు బలంగా ఉండటంతో ద్రవ్య లక్ష్యాలు, ఖర్చుల అవసరాల మధ్య సమతుల్యత పాటిస్తుందని సమాచారం. ఎకానమీ రికవరీ సాధనకు ఖర్చులు పెంచాలని, అందుకు ద్రవ్య లక్ష్యాలను సడలించాలని విజ్ఞప్తులు వస్తున్నా ద్రవ్య క్రమశిక్షణ పాటించడానికి కేంద్ర ఆర్థికశాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
కరోనా తొలి వేవ్ వేళ ఆర్థికవేత్తలు, కార్పొరేట్ సెక్టార్ నుంచి ఒత్తిళ్లు పెరిగినా ఖర్చు విషయంలో కేంద్రం కఠినంగానే వ్యవహరించింది. అయినప్పటికీ హెల్త్కేర్, రూరల్ ఎంప్లాయిమెంట్ రంగాల్లో ఖర్చు పెంచుతూనే ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడానికి మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపులు పెంచేసింది కేంద్రం. నగదు కొరత సమస్య ఎదుర్కొంటున్న రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు పెంచనున్నారని తెలుస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జాతీయ రహదారుల నిర్మాణానికి అధిక నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు.
ఎన్నికల సంవత్సరంలోనూ కేవలం ఇంటరెస్ట్ పేమెంట్స్కు పరిమితం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఖర్చు చేసింది. 22 లక్షల కోట్ల టాక్స్ రెవెన్యూ, రూ. లక్షల కోట్ల ఇంటరెస్ట్ పేమెంట్స్ ద్వారా బడ్జెట్కు రూపకల్పన చేస్తుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పిస్తారు.
గతేడాది సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు 6.8 శాతం లేదా 12.05 లక్షల కోట్లు ఉంటుందని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. వాస్తవంగా రూ.12 లక్షల కోట్ల మేరకు రుణాల ద్వారా నిధులు సేకరించింది. తొలుత 9.5 శాతంగా ద్రవ్యలోటును అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2020లో బడ్జెట్లో రూ.7.8 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేసినా.. కరోనాతో పరిస్థితి తిరగబడింది. పలు దెబ్బతిన్న రంగాలకు నిధులు సమకూర్చడంతో ద్రవ్యలోటు రూ.12 లక్షల కోట్లకు పెరిగింది.