RBI | ముంబై, అక్టోబర్ 6: దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, సుస్థిర వృద్ధిరేటుకు అధిక ద్రవ్యోల్బణంతో పెను ముప్పేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ్యాఖ్యానించింది. పెరుగుతూపోతున్న ధరలు.. అన్ని రంగాలను ప్రభావితం చేస్తాయన్నది. మూడు రోజులపాటు కొనసాగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ద్రవ్యోల్బణం అంచనాను యథాతథంగానే ఉంచిన ఆర్బీఐ.. అధిక ద్రవ్యోల్బణం వల్ల కలిగే నష్టాలను మాత్రం స్పష్టం చేసింది. ఈసారి ద్రవ్యోల్బణం 5.4 శాతంగా
నమోదు కావచ్చన్న ఆర్బీఐ.. జూలై, ఆగస్టులతో పోల్చితే సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగొస్తున్న కూరగాయల ధరలతోపాటు తగ్గిన వంటగ్యాస్ ధరలతో ద్రవ్యోల్బణం శాంతించవచ్చనీ పేర్కొన్నది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం లక్ష్యానికి దగ్గరగా ధరల్ని తెచ్చేందుకు బాండ్ల విక్రయం ద్వారా తమ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తామని ఆర్బీఐ సంకేతాలిచ్చింది.
ఇక వరుసగా నాల్గోసారీ కీలక వడ్డీరేట్ల జోలికి సెంట్రల్ బ్యాంక్ వెళ్లలేదు. రెపోరేటు, రివర్స్ రెపోరేటును యథాతథంగానే ఉంచాలని ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద, రివర్స్ రెపోరేటు 3.35 శాతం వద్దే ఉన్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపర్చేందుకు రెపోరేటును వరుసగా తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు మళ్లీ పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రెపోరేటును ఆర్బీఐ ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీంతో కరోనాకు ముందున్న స్థాయిని మించిపోయింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మొదలు రెపోరేటును స్థిరంగానే ఉంచుతూ వస్తోంది.
ఈ 2023-24కుగాను దేశ జీడీపీ అంచనానూ ఈసారి ఆర్బీఐ మార్చలేదు. గత అంచనానే కొనసాగిస్తూ 6.5 శాతంగా ప్రకటించింది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటుచేసుకున్నప్పటికీ భారత వృద్ధిరేటుపై విశ్వాసం కనబర్చిన ఆర్బీఐ.. ప్రపంచ వృద్ధికి నవ చోదక శక్తిగా భారత్ ఆవిర్భవిస్తుందన్న ఆశాభావాన్నీ వెలిబుచ్చింది. ఇక ఇప్పటికీ వృద్ధికి మద్దతిచ్చే ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం అదుపునకే పెద్దపీట వేస్తామని ఆర్బీఐ చెప్పింది. తదుపరి ద్రవ్యసమీక్ష డిసెంబర్ 6-8 తేదీల్లో ఉండనున్నది.
ఈ నెల 8 (ఆదివారం) నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు. శనివారంతో రూ.2వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన వారం రోజుల గడువు పొడిగింపు ముగుస్తున్నది. దీంతో ఇంకా రూ.2వేల నోట్లను మార్చుకోవాల్సినవారు ఎవరైనా ఉంటే సమీపంలోని ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లవచ్చని దాస్ సూచించారు. ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
వీటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని సెప్టెంబర్ 30 వరకు గడువూనూ ఇచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో మరో వారం రోజులు ఈ సౌకర్యాన్ని పొడిగించగా, శనివారంతో అది పూర్తవుతున్నది. ఇదిలావుంటే రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు (87 శాతం) తిరిగొచ్చేశాయని దాస్ తెలిపారు. బ్యాంకుల్లోనే డిపాజిట్ అయ్యాయన్న ఆయన.. ఇంకా రూ.12,000 కోట్లు రావాల్సి ఉందన్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్లోనే వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించే వీలుందని పలువురు ఆర్థిక నిపుణులు, బ్యాంకింగ్ పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు నెలల్లో జరిపిన ద్రవ్యసమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. తాజా ద్రవ్యసమీక్షలోనూ అదే బాటలో రిజర్వ్ బ్యాంక్ నడిచింది. దీంతో వచ్చే రెండు ద్రవ్య సమీక్షల్లోనూ (డిసెంబర్, ఫిబ్రవరి) వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో ఇబ్బందులు ద్రవ్యోల్బణాన్ని ఇంకా ఎగదోయవచ్చని, కనుక ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) వడ్డీరేట్ల కోత కష్టమేనని క్రిసిల్ అంటున్నది.
కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడం వృద్ధిదాయక చర్యే. పీఐడీఎఫ్లో పీఎం విశ్వకర్మ పథకాన్ని కలిపేయడం మంచి నిర్ణయం. చిన్నతరహా కళాకారులకు ప్రయోజనం చేకూరుతుంది.
-దినేశ్ కుమార్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వల్ల ఈ పండుగ సీజన్లో గృహ విక్రయాలకు ఆర్బీఐ జోష్నిచ్చినైట్టెంది. ఎంతోమంది మదుపరులు స్థిరాస్తి కొనుగోలుకు ముందుకు రావడానికి వీలు కలిగింది. అయితే వచ్చే ద్రవ్యసమీక్షలోనైనా వడ్డీరేట్లు తగ్గితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
-బొమన్ ఇరానీ, క్రెడాయ్ అధ్యక్షుడు
ఆర్బీఐ నిర్ణయాలు అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. రెపోరేటును యథాతథంగా ఉంచి దేశ ఆర్థిక వ్యవస్థకు, వృద్ధిరేటుకు రిజర్వ్ బ్యాంక్ మద్దతిచ్చింది. స్థిరమైన వడ్డీరేట్లు మార్కెట్లో మరింత పోటీ వాతావరణాన్ని సృష్టించగలవు.
-త్రిభువన్ అధికారి, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ సీఈవో
ఆర్బీఐ ద్రవ్యసమీక్ష నిర్ణయాలు ముందుగా ఊహించినట్టుగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కదలికల్ని నిశితంగా గమనిస్తున్న ఆర్బీఐ వైఖరి సరైనదే. త్వరలోనే ధరలు శాంతించి వృద్ధికి బాటలు పడుతాయని ఆశిస్తున్నాను.
-శుభ్రకాంత్ పాండా, ఫిక్కీ అధ్యక్షుడు