Electric Vehicles | కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు ఉచితంగా పర్మిట్లు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఈవీల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కమర్షియల్ ఈవీల ఓనర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి సమాచారం. కమర్షియల్ ఈవీలకు పర్మిట్లు అవసరం లేదని కేంద్రం గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది.
అయినా, కమర్షియల్ ఈవీలకు పర్మిట్ పత్రాలు లేవని రాష్ట్రాల రవాణాశాఖ అధికారులు తమను వేధిస్తున్నారని ఆయా వాహనాల యజమానులు చెబుతున్నారు. ఇటీవల అధికారులతో సమావేశమైన కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఈవీలకు పర్మిట్లు అవసరం లేదని నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారని సమాచారం.
కమర్షియల్ ఈవీల ఓనర్లు, డ్రైవర్లు వేధింపులకు గురి కాకుండా కేంద్రం నోటిఫికేషన్ ఉపకరిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్యాటరీ ఆపరేటింగ్ వెహికల్స్, మిథనాల్ లేదా ఇథనాల్తో నడుస్తున్న ప్యాసింజర్ వెహికల్స్, రవాణా వెహికల్స్ను పర్మిట్ల నుంచి మినహాయిస్తూ 2018 అక్టోబర్ 18న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
కమర్షియల్ ఈవీలకు ఉచిత పర్మిట్లపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్కు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కొందరు ట్రాన్స్పోర్ట్ యజమానులు చెప్పారని తెలుస్తున్నది. `కమర్షియల్ ఈవీ రిజిస్ట్రేషన్ పూర్తయినప్పుడే ఆటోమేటిక్గా పర్మిట్ ఇచ్చినట్లే. అటుపై ప్రత్యేకంగా పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తప్పనిసరి ఆదేశాలు జారీ చేయాలి` అని ఈవీ బస్సు ఆపరేటర్ ఒకరు చెప్పారు.