Budget 2022 | బిట్ కాయిన్.. ఎథీరియం తదితర క్రిప్టో కరెన్సీలపై ఇండియన్స్ పెట్టుబడుల భవితవ్యం తేలనున్నది. దేశీయంగా అంటే ఇండియన్స్ క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసి స్టోర్ చేసుకోవచ్చా.. అనే అంశంపై క్లారిటీ రానున్నది. వచ్చే నెల ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో క్రిప్టో కరెన్సీల క్రయ విక్రయాలను టీడీఎస్ లేదా టీసీఎస్ పరిధిలోకి తీసుకు వస్తామని తెస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీల విక్రయం మీద వచ్చే ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ప్రతిపాదన అమల్లోకి రాబోతున్నది. ఇంతకుముందు లాటరీ, గేమ్ షోస్, పజిల్ విజేతలపై మాదిరే క్రిప్టో లావాదేవీల్లో లాభాలపైనా 30 శాతం పన్ను విధించొచ్చునని నాంగియా అండర్సన్ ఎల్ఎల్పీ టాక్స్ లీడర్ అరవింద్ శ్రీవత్సన అభిప్రాయ పడ్డారు.
క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన భారతీయులు 10.07 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఇన్వెస్టర్లే ఎక్కువ. అమెరికన్లు, రష్యన్లు తర్వాతీ స్థానాల్లో ఉన్నారు. ఇక 2030 నాటికి క్రిప్టో కరెన్సీల్లో ఇండియన్ల ఇన్వెస్ట్మెంట్స్ 241 మిలియన్ల డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిప్టోల నియంత్రణపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుందని అంచనాలు ఉన్నా.. ఆచరణలో అదేమీ జరుగలేదు. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం బిల్లు పార్లమెంట్ ముందుకు తెస్తుందని భావిస్తున్నారు.
ఒకవేళ క్రిప్టో కరెన్సీల్లో ఇండియన్స్ పెట్టుబడులపై కేంద్రం నిషేధం విధించకపోతే.. వాటిపై తీవ్రమైన పన్ను విధానంతో ముందుకు రావచ్చునని అంచనా. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు, మార్కెట్, రిస్క్ను పరిగణనలోకి తీసుకుని పన్నుల వ్యవస్థ రూపుదిద్దుకోనుందని తెలుస్తున్నది. ఇందుకు అనుగుణంగా టాక్స్ డిడక్షన్ సోర్స్ (టీడీఎస్), టాక్స్ కలెక్టెక్ సోర్స్ (టీసీఎస్)ల్లో నిబంధనల్లో కీలక మార్పులు తేనున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నిబంధనలతో మార్పులు క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్టర్ల మూలాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడానికి సాయపడతాయని భావిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) యూనిట్ల క్రయ, విక్రయాలపై ట్రేడింగ్ కంపెనీల రిపోర్టింగ్ నిబంధన క్రిప్టో కరెన్సీలకూ వర్తింపజేస్తారు. అంటే క్రిప్టో కరెన్సీల క్రయ విక్రయాలను స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ (ఎస్ఎఫ్టీ) పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఎస్ఎఫ్టీ వెల్లడించడం ద్వారా పన్ను చెల్లింపుదారుడు చేపట్టి భారీ మొత్తం విలువ (హై వాల్యూ ట్రాన్సాక్షన్స్)ను అంచనా వేయడానికి వీలు కలుగుతుందని తెలుస్తున్నది.
ఇప్పటికైతే క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై దేశీయంగా ఎటువంటి నిషేధం, నియంత్రణ లేదు. మరోవైపు, దేశీయంగా ఆర్బీఐ ఆధ్వర్యంలో డిజిటల్ కరెన్సీని ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే.. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు ప్రవేశ పెడతారని అంచనాలు ఉన్నాయి. ఇక 2022-23 బడ్జెట్ ప్రతిపాదనల్లో క్రిప్టో కరెన్సీల లావాదేవీలను చట్ట పరిధిలోకి తేవడానికి ఆదాయం పన్ను చట్టంలో సవరణలు తేవాలని కేంద్రం యోచిస్తున్నది.