న్యూఢిల్లీ, మార్చి 31: పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. వ్యవస్థలో పెరుగుతున్న వడ్డీ రేట్లను అనుసరించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రేట్లను 0.7 శాతం వరకూ పెంచుతున్నట్టు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే విశేష ఆదరణ ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సేవింగ్స్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా 7.1 శాతం, 4 శాతం వద్దే అట్టిపెట్టింది. ఇతర పొదుపు పథకాలపై వడ్డీ రేటు 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకూ పెంచారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై వడ్డీ రేటు అత్యధికంగా 7 శాతం నుంచి 7.7 శాతానికి పెరుగుతుంది. ఈ పెంపుదల ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకూ వర్తిస్తుంది. బాలికలకు ఉద్దేశించిన పొదుపు పథకం సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్పై వడ్డీ రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)పై 7.2 శాతం నుంచి 7.5 శాతానికి అధికమవుతుంది. పెరిగిన వడ్డీ రేటు కారణంగా కేవీపీ ద్వారా సొమ్ము 115 నెలలకే చేతికి వస్తుంది. ఇంతకు ముందు ఇది 120 నెలలు.
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సవరిస్తారు. గత త్రైమాసికంలో సైతం స్వల్పంగా రేట్లను పెంచారు. తాజా సవరణ ప్రకారం మంథ్లీ ఇన్కం స్కీమ్పై రేటు 30 బేసిస్ పాయింట్లు అధికమై 7.4 శాతానికి చేరుతుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్పై వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేండ్ల డిపాజిట్పై 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, మూడేండ్లకు 6.9 శాతం నుంచి 7 శాతానికి, ఐదేండ్లకు 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు.