మార్చికల్లా ఐపీవోకు వెళ్లనున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. సంస్థ చైర్మన్తోపాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్కుమార్ పదవీ కాలం ఏడాది పొడిగించింది. దీంతో సంస్థ చైర్మన్గా ఎమ్మార్ కుమార్ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతారు. ఎల్ఐసీ చైర్మన్ పదవీ కాలం పొడిగించడం ఇది రెండోసారి. గతేడాది జూన్ 30న ఎమ్మార్ కుమార్కు కేంద్రం తొమ్మిది నెలల పొడిగింపునిచ్చింది. దీంతో వచ్చే మార్చి 13 నాటికి ఆయన పదవీ కాలం ముగియనున్నది. తద్వారా ఎల్ఐసీ చైర్మన్గా మూడేండ్ల పదవీ కాలాన్ని ఎమ్మార్ కుమార్ పూర్తి చేసుకుంటారు.
ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐపీవోకు వెళ్లనున్న నేపథ్యంలో చైర్మన్ ఎమ్మార్ కుమార్, ఎండీ రాజ్కుమార్ పదవీ కాలం పొడిగించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఐపీవో ప్రక్రియ సజావుగా సాగాలనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల కథనం. ఇక ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లడానికి వీలుగా ఇప్పటికే ఎల్ఐసీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఆ సవరణలో 2021 జూన్ 30 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ లిస్టింగ్ అయితే, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.10 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. తద్వారా దేశంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ గల బీమా సంస్థగా ఎల్ఐసీ నిలువనున్నదని సమాచారం.