Google Pixel | వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్.. భారత్లో స్మార్ట్ ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నది. దక్షిణ భారత దేశంలో తమిళనాడు రాష్ట్రం నుంచి `గూగుల్ పిక్సెల్స్ 8-ఏ ఫోన్లను తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నది. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా చైనా నుంచి ఇప్పటికే ఆపిల్ తన ఉత్పత్తుల మాన్యుఫాక్చరింగ్ను భారత్ వైపు మళ్లిస్తున్న నేపథ్యంలో గూగుల్ సైతం భారత్లో తన గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ను దేశీయంగా ఉత్పత్తి ప్రారంభానికి వేగంగా పావులు కదుపుతోందిని గూగుల్ వర్గాలు తెలిపాయి. `డెట్రాయిట్ ఆఫ్ ఇండియా` వైదొలిగిన తర్వాత తమిళనాడులో గూగుల్ స్మార్ట్ ఫోన్ల తయారీకి ముందుకు రావడం చారిత్రక పరిణామం అని, దీనివల్ల తమిళనాడు ప్రభుత్వానికి, ప్రజలకు మేలు కలుగనున్నదని భావిస్తున్నారు.
తమిళనాడులో గూగుల్ స్మార్ట్ ఫోన్ల తయారీకి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు విషయమై అమెరికాలో గూగుల్ మేనేజ్మెంట్తో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా, సీనియర్ అధికారులు చర్చలు జరిపారని సమాచారం. భారత్లో స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు విషయమై గూగుల్ అధికారికంగా స్పందించలేదు. కానీ ఇంతకుముందే తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి గూగుల్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
గతేడాదే తన పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్లను భారత్లోనే తయారుచేస్తామని గూగుల్ వెల్లడించింది. ఇప్పటికే భారత్లో ఐఫోన్ల తయారీని ఆపిల్, శాంసంగ్ తన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని భారత్కు తరలించిన సంగతి తెలిసిందే. భారత్లో స్మార్ట్ ఫోన్లు తయారుచేసిన కంపెనీలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్షియేటివ్లను కేంద్రం ప్రకటించింది.