Apple-Google | దిగ్గజ కంపెనీలైన ఆపిల్, గూగుల్ మధ్య త్వరలో భారీ ఒప్పందం జరుగనున్నది. ఆపిల్ ఐఫోన్లలో గూగుల్కు చెందిన జెమిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అందించేందుకు కంపెనీతో చర్చలు జరుపుతున్నది. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ నివేదిక పేర్కొంది. త్వరలోనే యూజర్లకు జెమిని ఏఐ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఇటీవల ఆపిల్ కంపెనీ.. మైక్రోసాఫ్ట్కి చెందిన ఓపెన్ ఏఐ ఫీచర్స్ అందించేందుకు ఓపెన్ ఏఐతో చర్చించింది. నివేదిక ప్రకారం.. ఆపిల్ కంపెనీ ఏఐ మోడల్ను ఐఫోన్ ఐఓఎస్ 18లో అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. పవర్ జనరేటివ్ ఏఐ ఫీచర్స్ను అందించేందుకు భాగస్వాముల కోసం వెతుకుతున్నది.
అయితే, ఇప్పటి వరకు ఏ కంపెనీతోనూ ఒప్పందం మాత్రం జరుగలేదు. ఈ ఏడాది జూన్లో ఆపిల్ వార్షిక వలర్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమం వరకు ఒప్పందాలపై ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తున్నది. వాస్తవానికి జనరేటివ్ ఏఐలో ఆపిల్ గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీల కంటే వెనుకపడిపోయింది. కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇటీవల మాట్లాడుతూ జనరేటివ్ ఏఐపై ఈ ఏడాది ఆఖరులో వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ విభాగంలో కంపెనీ భారీగానే పెట్టుబడులు పెడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్24 సిరీస్ మొబైల్లో జనరేటివ్ ఏఐ ఫీచర్స్ అందించేందుకు ఈ ఏడాది జనవరిలో గూగుల్తో ఒప్పందం చేసుకున్నది.