Sundar Pichai | సాధారణంగా ఎవరైనా ఒకటో రెండు మొబైల్స్ను వినియోగిస్తుంటారు. కానీ, టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రెండు కాదు మూడు కాదు ఏకంగా 20 స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఆయన ఎందుకోసం ఈ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సుందర్ పిచాయ్ ఆయా డివైజ్లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును పరీక్షిస్తుంటారు.
అందుకోసం ఆయన 20 స్మార్ట్ మొబైల్స్ను మార్కెట్లోకి వచ్చిన మొబైల్ను కొనుగోలు చేసి ఆయా డివైజెస్లో గూగుల్ యాప్స్, ఉత్పత్తులు ఎలా పని చేస్తున్నాయి ? ఏవైనా సమస్యలున్నాయా? అని తెలుసుకుంటానని తెలిపారు. తరచుగా పాస్వర్డ్లను మార్చిన సమయంలో గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించడం సురక్షితమైందని సుందర్ పిచాయ్ తెలిపారు.
డిజిటల్ ప్రపంచంలో వినియోగదారులు తమను తాము రక్షించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి రోజూ ఉదయం టెక్ మీమ్ అనే వెబ్సైట్ను సందర్శిస్తానని గూగుల్ సీఈవో తెలిపారు. అందులోని అప్డేట్స్ను క్రమం తప్పకుండా చదువుతానని.. టెక్ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్న వారికి ఇదో మంచి వెబ్సైట్ అని చెప్పారు. ప్రస్తుతం వెబ్ సెర్చింగ్ విధానం రోజురోజుకూ మారుతూ వస్తోందని.. భవిష్యత్ అవసరాల కోసం మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
త్వరలోనే జెమిని ఏఐ చాట్బాట్ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల ఫోన్ స్క్రీన్ టైమ్పై ఓ ప్రశ్నకు స్పందిస్తూ పిల్లల ఫోన్ అడిక్షన్, స్క్రీన్ టైమ్ విషయంలో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీ పరిజ్ఞానం ముఖ్యమన్న ఆయన.. అయితే దానికి సమయాన్ని నిర్ణయించుకోడం కూడా చాలా ముఖ్యమన్నారు.