న్యూఢిల్లీ : మెటా, అమెజాన్, ట్విట్టర్ల బాటలోనే సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం మాస్ లేఆఫ్స్కు తెగబడవచ్చని టెకీల్లో గుబులు రేగుతోంది. లేఆఫ్స్ తప్పవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంకేతాలు పంపడంతో ఏ క్షణాన ఉద్యోగం ఊడుతుందోననే అభద్రత ఉద్యోగులను వెంటాడుతోంది. రాబోయే వారాల్లో 10,000 మంది ఉద్యోగులను గూగుల్ మాతృసంస్ధ అల్ఫాబెట్ తొలగిస్తుందనే వార్తలు కలకలం రేపాయి.
గత వారం జరిగిన గూగుల్ ఉద్యోగుల భేటీలో సీఈఓ సుందర్ పిచాయ్ లేఆఫ్స్ తప్పవనే బాంబు పేల్చడంతో దీనిపై వివరణ కోరిన ఉద్యోగులకు ఆయన భవిష్యత్ను ఊహించడం కష్టమని వ్యాఖ్యానించారు. ముందుచూపుతో తాను ఎలాంటి హామీలు ఇవ్వలేనని పిచాయ్ చెప్పడం కూడా కొలువుల కోత తప్పదనే సంకేతాలు పంపుతోంది. గతంలోనూ లేఆఫ్స్పై కంపెనీ సంకేతాలు పంపుతూనే ఉంది. ఏడాది చివరిలోగా ఉద్యోగులు తమ పనితీరు పెంచుకోవాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే సిబ్బందిని హెచ్చరించారు.
కీలక రోల్స్ మినహా హైరింగ్ను నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరోవైపు గ్రాడ్ అనే న్యూ పెర్ఫామెన్స్ టూల్ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నాలు చేపట్టడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ లేఆఫ్స్లో భాగంగా వడపోతల కోసమేనని టెకీలు పేర్కొంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ట్విట్టర్ పగ్గాలను ఎలన్ మస్క్ చేపట్టినప్పటి నుంచి సిలికాన్వ్యాలీలో లేఆఫ్స్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ట్విట్టర్, అమెజాన్, మెటా సహా పలు టెక్ కంపెనీలు వందల మంది ఉద్యోగులను తొలగించగా స్టార్టప్లు సైతం లేఆఫ్స్ బాటపట్టాయి. తాజాగా సేల్స్ఫోర్స్, అడోబ్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.