న్యూయార్క్ : సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను ఏప్రిల్ 4 నుంచి కార్యాలయాకు రావాలని కోరింది. బే ఏరియా సహా పలు అమెరికన్ లొకేషన్స్లోని ఉద్యోగులకు వాలంటరీ వర్క్ ఫ్రం హోం ఆప్షన్కు దిగ్గజ సెర్చింజన్ స్వస్తి పలికింది. అంతకుముందు ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు కొవిడ్-19 టీకా రెండు డోసులు వేసుకోవాలనే నిబంధననూ గూగుల్ సడలించింది.
గత రెండేండ్లుగా తమ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారని క్రమంగా కరోనా చికిత్స, నివారణలో ముందడుగు పడటంతో పాటు కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో బే ఏరియా సహా పలు లొకేషన్స్లో ఉద్యోగులను హైబ్రిడ్ వర్క్ వీక్ పద్ధతిలో కార్యాలయాలకు రప్పిస్తామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కేసీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు.
ఉద్యోగులు కార్యాలయాల్లో విధిగా మాస్క్ ధరించాలని, టీకా తీసుకోని వారు కొవిడ్-19 నిబంధనలను పాటించాలని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్క్లిఫ్ ఉద్యోగులకు పంపిన నోట్లో స్పష్టం చేశారు. ఫిట్నెస్ సెంటర్లు, షటిల్ సర్వీసులు, పాంట్రీలు వంటి ప్రదేశాలను త్వరలో రీఓపెన్ చేస్తామని ఆ నోట్లో ప్రస్తావించారు. కాగా నూతన నిబంధనలు అమెరికన్ గూగుల్ ఉద్యోగులకే వర్తిస్తాయి. భారత ఉద్యోగులను ఎప్పటి నుంచి కార్యాలయాలకు రప్పిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు.