LIC | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2022 ఆగస్టు నుంచి ఎల్ఐసీ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 16 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రెండేండ్లుగా ఉన్న వేతన బకాయిలను ఎల్ఐసీ ఉద్యోగులు అందుకోనున్నారు. ప్రాథమిక వేతనంతోపాటు ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఈ వేతన పెంపు వల్ల 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30 వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎల్ఐసీపై ఏటా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందని తెలుస్తున్నది. ఎల్ఐసీ ఉద్యోగుల వేతన బిల్లు రూ.29 వేల కోట్లకు చేరుకోనున్నది.
ఇదిలా ఉంటే, ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం 2024 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ.12,868.72 కోట్ల భారం పడుతుందని తెలుస్తున్నది.