మొన్న 7 శాతం.. నిన్న 6.5 శాతం.. నేడు 5.9 శాతమే.
ఇదీ.. భారత జీడీపీ వృద్ధిపై ఈ నెల మొదలు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్లో మారుతున్న అంచనాల తీరు. పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు.. ఇలా అనేక అంశాలు దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి మరి.
న్యూఢిల్లీ, మార్చి 24: ఈ ఏడాదికిగాను దేశ జీడీపీ వృద్ధి అంచనాలను అమెరికా బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్ మరోసారి తగ్గించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ఉత్పత్తికి బ్రేకులుపడ్డాయి. భారత ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తునే వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈసారి దేశ ఆర్థిక వృద్ధిరేటు 5.9 శాతాన్ని మించి ఉండబోదని గోల్డ్మన్ సాచ్స్ తాజాగా అభిప్రాయపడింది.
2026లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని గతంలో గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. అయితే ఈ నెల 13న దీన్ని 6.5 శాతానికి తగ్గించింది. ఇప్పుడు 5.9 శాతానికి కుదించింది. కేవలం 11 రోజుల్లోనే అర శాతానికి (60 బేసిస్ పాయింట్లు) పైగా కోత పెట్టడం గమనార్హం. దీని వెనుక మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలే కారణంగా ప్రధానంగా కనిపిస్తున్నాయి. గత నెల 28 నుంచి ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించాయి. అప్పట్నుంచి గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అమెరికాకు మద్దతిస్తున్నారని పొరుగు దేశాలైన కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాక్లపై ఇరాన్ దాడులు చేస్తున్నది. ఆయా దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నది. దీంతో క్రూడాయిల్, సహజ వాయువు ఉత్పత్తి నిలిచిపోయింది.
పైగా మిడిల్ ఈస్ట్ నుంచి భారత్, చైనా సహా ఇతర దేశాలకు జరిగే రవాణాలో కీలకమైన హొర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసేసింది. ఈ పరిణామం ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ఆయా పెట్రో ఉత్పత్తుల ధరలూ పెరిగాయి. గ్యాస్ కొరత కూడా కనిపిస్తుండగా, దేశవ్యాప్తంగా చాలా హోటళ్లు, ఇతర గ్యాస్ ఆధారిత వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడుతున్నదీ చూస్తూనే ఉన్నాం. ఎరువుల తయారీ కుంటుబడి వ్యవసాయ రంగం సైతం ప్రభావితం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రవాణా రంగంపైనా భారం పడుతుండగా.. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లతో ఆయా వస్తూత్పత్తులన్నింటి ధరలూ ఎగబాకి ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. ఇది మరింత ముదిరితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్య సమీక్షల్లో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలు లేకపోలేదు. దీంతో వడ్డీరేట్లు పెరుగడం ఖాయమనే మెజారిటీ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రుణ లభ్యత క్షీణించి అన్ని రంగాల్లో కార్యకలాపాలు మందగిస్తాయి. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుందని గోల్డ్మన్ సాచ్స్ చెప్తున్నది.
ముడి చమురు దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయం.. దేశంలో అన్నింటి ధరల్ని ఎగదోయగలదని గోల్డ్మన్ సాచ్స్ హెచ్చరిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.6 శాతానికి పెరుగవచ్చని అంచనా వేస్తున్నది. గతంలో ఇది 3.9 శాతంగానే ఉండటం గమనార్హం. కాగా, హొర్ముజ్ జలసంధిలో వచ్చే నెల ప్రథమార్ధం (ఏప్రిల్ 15) వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న అభిప్రాయాన్ని గోల్డ్మన్ సాచ్స్ వెలిబుచ్చుతున్నది. దీంతో భారత్ జీడీపీ అంచనాలు ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యం లేదన్న సంకేతాలు వస్తున్నాయి.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయిలో కదలాడుతున్నది. దీంతో ఈ ఒత్తిడి ఆర్బీఐపై తప్పక ఉంటుందని, అందుకే రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) పెరిగే వీలున్నదని గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేస్తున్నది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూపీ వాల్యూ దాదాపు 4 శాతం పతనమైంది. సోమవారం తొలిసారి 94 మార్కునూ దాటేసింది. నిజానికి గత ఏడాది మొత్తంగా 4.7 శాతం పతనం నమోదైంది. కానీ ఈ 3 నెలల్లోనే ఇంచుమించుగా అంతటి నష్టాలు వాటిల్లాయి. రూపాయి విలువ పడిపోయినకొద్దీ దేశంలోకి వచ్చే దిగుమతులు ఖరీదవుతాయి. చివరకు ఈ భారం వినియోగదారులపైనే పడుతుంది. ఇక దేశీయ కరెంట్ ఖాతా లోటు జీడీపీలో ఈ సంవత్సరం 2 శాతానికి పెరుగవచ్చని గోల్డ్మన్ సాచ్స్ చెప్తున్నది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ రుణ భారం పెరుగుతుందని, డాలర్ నిల్వలు పడిపోయే వీలుందని అంటున్నది.