ముంబై/న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భౌగోళిక రాజకీయ ప్రతికూల పరిస్థితుల మధ్య వచ్చే ఏడాది పసిడి ధరలు పరుగులు పెట్టవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో కొత్త ఏడాది తులం బంగారం రూ.60,000లను తాకవచ్చంటున్నారు. ఒడిదుడుకుల నడుమ పుత్తడిని మరింత మంది మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా చూసే వీలుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 పలుకుతున్నది. వచ్చే ఏడాది ఎంసీఎక్స్లో బంగారం ధరలు రూ.48,500-60,000 శ్రేణిలో ట్రేడ్ కావచ్చని కొటక్ సెక్యూరిటీస్ ఉపాధ్యక్షుడు, కమోడిటీ రిసెర్చ్ విభాగం అధిపతి రవీంద్ర వీ రావు అంచనా వేశారు. కాగా, ఇప్పుడు ఎంసీఎక్స్ కమోడిటీ స్టాక్ ఎక్సేంజ్పై 10 గ్రాములు రూ.54,790గా ఉన్నది.
2023లో అంతర్జాతీయంగా ఔన్సు గోల్డ్ 1,670-2,000 డాలర్ల మధ్య ట్రేడ్ అయ్యే వీలున్నదని చెప్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో 1,800 డాలర్లు పలికింది. ఇప్పుడు కూడా 1,803 డాలర్ల వద్దే కదలాడుతున్నది. అయితే మార్చిలో గరిష్ఠంగా 2,070 డాలర్లుగా నమోదైంది. కానీ నవంబర్లో కనిష్ఠంగా ఔన్సు బంగారం 1,616 డాలర్లుగానే ఉన్నది. అయితే అప్పట్నుంచి త్వరగా కోలుకుంటున్నదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇక వచ్చే ఏడాది ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్)లో పండుగల సీజన్కు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యవిధాన ఉత్సాహం తోడైతే మార్కెట్లో పసిడి ధరలు మరింత పెరిగే వీలుందని జ్యుయెల్లర్స్ అంచనా వేస్తున్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడం ఖాయమన్న అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే గ్లోబల్ మార్కెట్లో ఔన్సు 1,885 డాలర్లుగా, ఎంసీఎక్స్లో 10 గ్రాములు రూ.57,000లుగా అంచనా వేస్తున్నామని రవీంద్ర రావు అన్నారు. కాగా, ఈ ఏడాది మొదట్లో ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం రూ.47,850గా ఉన్నది. మార్చిలో మాత్రం రూ.55,680 పలికింది. సెప్టెంబర్లో తిరిగి రూ.48,950లకు పడిపోయింది.
రాబోయే బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరుతున్నది. దీనివల్ల ఎగుమతులు పెరుగుతాయని, పసిడితో కూడిన రత్నాభరణాల తయారీ రంగంలో కార్యకలాపాలు ఊపందుకుంటాయని చెప్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాణిజ్య మంత్రిత్వ శాఖ పైవిధంగా విజ్ఞప్తి చేస్తున్నది. ఈ ఏడాది జూలైలో పసిడి దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి మోదీ సర్కారు పెంచిన సంగతి విదితమే. ఇందులో కనీస కస్టమ్స్ సుంకం 12.5 శాతంగా, వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్సు 2.5 శాతంగా ఉన్నది.