Gold Smuggling | కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరిగాయి. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో దేశంలోకి అక్రమంగా బంగారం రవాణా కూడా ఎక్కువైంది. అక్రమ బంగారం రవాణా (స్మగ్లింగ్)పై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టడంతో సంచలన విషయాలు బయట పడ్డాయి. నిఘా పెంచడంతో అక్రమార్కులు తేలిగ్గా దొరికి పోతున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే వివిధ దర్యాప్తు సంస్థలు 3000 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం సోమవారం పార్లమెంట్కు వెల్లడించింది. గత మూడేండ్లలో ఇది అత్యధిక పట్టివేత కావడం గమనార్హం. అంతకుముందు 2019లో 3678 కిలోల బంగారాన్ని అక్రమార్కుల నుంచి కేంద్రం జప్తు చేసింది.
ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 3,588 కేసుల్లో 3,081.61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2021లో 2,383 కిలోల, అంతకుముందు 2020లో 2,154 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.
కేరళలో అత్యధికంగా 690 కిలో్ల పసిడి, మహారాష్ట్రలో 474 కిలోలు, తమిళనాడులో 440 కేజీలు, పశ్చిమ బెంగాల్ లో 369 కిలోల బంగారాన్ని అధికారులు జప్తు చేశారు. అక్రమంగా బంగారాన్ని రవాణా చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుందని పంకజ్ చౌదరి వెల్లడించారు.